
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఎదురైన చేదు పరాజయాలను మరిచిపోయి, యువ భారత్ మళ్లీ గెలుపు బాట పట్టేందుకు సిద్ధమైంది. జూలై 23న హరారే వేదికగా జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20లో సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో సరికొత్త ఓపెనింగ్ కాంబినేషన్తో భారత్ బోణీ కొడుతుందో లేదోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించే బ్యాలెన్స్డ్ ట్రాక్. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించి స్పిన్నర్లకు మంచి గ్రిప్, టర్న్ లభిస్తుంది. ఆరంభంలో ఉండే సీమ్ మూవ్మెంట్ను పేసర్లు వాడుకుంటే బ్యాటర్లకు కష్టాలు తప్పవు. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 156 పరుగులు కాగా, అత్యధిక టీ20 స్కోరు 229 పరుగులుగా ఉంది.
ఇదికూడా చదవండి: ఆల్రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి.. భారత్ కొంపముంచుతోన్న గంభీర్ మొండి పట్టుదల
ఇప్పటివరకు ఈ మైదానంలో జరిగిన 41 టీ20 మ్యాచ్లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే 23 సార్లు విజయం సాధించాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందస్తు బ్యాటింగ్ ఎంచుకోవడం శుభసూచకం. అయితే ఐపీఎల్ తరహా ఫ్లాట్ ట్రాక్లకు అలవాటుపడిన మన యువ బ్యాటర్లకు ఈ పిచ్ సవాలుగా మారనుంది.
ఈ మ్యాచ్లో భారత ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు తోడుగా పంజాబ్ కింగ్స్ స్టార్ ప్రభుసిమ్రన్ సింగ్కు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కుడి, ఎడమ చేతి బ్యాటింగ్ కాంబినేషన్ కుదరడం ప్రభుసిమ్రన్కు కలసివచ్చే అంశం.
మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే ఫినిషర్ రింకూ సింగ్ను పక్కనబెట్టాల్సి వస్తుంది. కాబట్టి వైభవ్కు తొలి మ్యాచ్లో నిరాశ తప్పకపోవచ్చు. విదేశీ గడ్డపై తడబడుతున్న ఇషాన్ కిషన్ స్థానంలో కీపర్గా ప్రభుసిమ్రన్ సింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
మూడో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బరిలోకి దిగుతారు. కెప్టెన్గా వ్యూహాలు, ఫీల్డింగ్ మార్పుల్లో శ్రేయస్ నిరూపించుకోవాల్సి ఉండగా, తిలక్ వర్మ నిలకడగా ఆడి విమర్శకులకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఐదో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ శివమ్ దూబే, ఆరో స్థానంలో ధనాధన్ ఫినిషర్ రింకూ సింగ్ సేవలు అందించనున్నారు.
ఇదికూడా చదవండి: టీమిండియా పరువు తీశారుగా.. ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!
స్పిన్ ఆల్రౌండర్గా యువ ఆటగాడు హర్ష్ దూబేకు మంచి అవకాశం లభించగా, ప్రధాన స్పిన్నర్గా రవి బిష్ణోయ్ రంగంలోకి దిగుతాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్ స్థానాలు ఖాయం కాగా, మూడో పేసర్ స్థానం కోసం మయాంక్ యాదవ్, అశోక్ శర్మ మధ్య తీవ్ర పోటీ ఉంది.
ముఖ్యంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబేల ప్రదర్శనపై అందరి కళ్లు ఉన్నాయి. ఇటీవల వరుసగా విఫలమవుతున్న ఈ ముగ్గురు తమ అసలైన సత్తా చాటి భారత జట్టును విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..