Ind Vs Pak: మళ్లీ మొదలుకానున్న భారత్ పాక్ క్రికెట్ పోరు?.. బీసీసీఐ నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ!

Ind Vs Pak: భారత్, పాకిస్థాన్ మధ్య మళ్లీ క్రికెట్ పోరు జరిగే అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది. ఐసీసీ ఆధ్వర్యంలో తటస్థ వేదికపై మూడు లేదా నాలుగు జట్లతో ప్రత్యేక బహుళ దేశాల సిరీస్ నిర్వహించే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. దుబాయ్‌లో జరిగే ఎఫ్‌టీపీ సమావేశంలో ఈ అంశం చర్చకు రానుండగా, బీసీసీఐ నిర్ణయంపైనే తుది ఫలితం ఆధారపడి ఉంది.

Ind Vs Pak: మళ్లీ మొదలుకానున్న భారత్ పాక్ క్రికెట్ పోరు?.. బీసీసీఐ నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ!
Ind Vs Pak

Updated on: Sep 07, 2026 | 8:18 AM

Ind Vs Pak: ఐసీసీ, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడే భారత్ పాకిస్థాన్ జట్లు ఇకపై ప్రత్యేక బహుళ దేశాల సిరీస్‌లో తలపడే అవకాశం కనిపిస్తోంది. తటస్థ వేదికలపై మూడు లేదా నాలుగు జట్లతో ఈ టోర్నీ నిర్వహించే అంశంపై ఐసీసీ సుదీర్ఘంగా ఆలోచిస్తోంది. రాజకీయ ఉద్రిక్తతల కారణం చేత 2012-13 సీజన్ నుంచి భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది క్రికెట్ అభిమానులు కేవలం ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్‌లు, ఆసియా కప్‌లలో మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థుల సమరాన్ని చూడగలుగుతున్నారు. తాజాగా పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం ఐసీసీ ఈ విధానానికి స్వస్తి పలికి, రెండు దేశాలతో పాటు మరికొన్ని ప్రధాన జట్లను కలిపి ఒక స్పెషల్ ట్రై సిరీస్ లేదా నాలుగు జట్ల టోర్నీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

దుబాయ్ ఐసీసీ సెమినార్‌లో కీలక చర్చ

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గత కొన్నేళ్లుగా తటస్థ వేదికల్లో ద్వైపాక్షిక సిరీస్‌లు పునరుద్ధరించాలని కోరుతున్నప్పటికీ బీసీసీఐ దానిని తోసిపుచ్చుతూ వస్తోంది. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో దుబాయ్ వేదికగా జరగనున్న ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. టెస్టు హోదా ఉన్న 12 దేశాలతో పాటు 8 అను అనుబంధ సభ్యత్వ దేశాల ప్రతినిధులు ఈ భేటీకి హాజరుకానున్నారు. బహుళ దేశాల టోర్నీల ద్వారా బ్రాడ్‌కాస్టర్లు, ప్రసారకర్తలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉండటంతో ఈ వ్యాపార ప్రతిపాదనకు ఆమోదం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే యూఏఈ, ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియా తటస్థ వేదికలుగా మారనున్నాయి.

అంతిమ నిర్ణయం బీసీసీఐ చేతిలోనే

ఈ తరహా టోర్నీల నిర్వహణపై ఐసీసీ కేవలం ఆలోచనలు మాత్రమే చేయగలదు తప్పిస్తే ఏ దేశ బోర్డును కూడా నిర్బంధించలేదు. భారత్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాలంటే భారత ప్రభుత్వంతో పాటు బీసీసీఐ ఆమోదం అత్యంత కీలకం. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై భారత కేంద్ర క్రీడా శాఖ స్పష్టమైన నిబంధనలు అమలు చేస్తోంది. మల్టీ-నేషన్ సిరీస్ అయినప్పటికీ బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఈ టోర్నీ సాధ్యం కాదని ఐసీసీ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి.

ప్రసార హక్కులు, ఆదాయంపై కన్ను

భారత్ పాక్ మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను నగదుగా మార్చుకోవడానికి ఐసీసీ, పాకిస్థాన్ బోర్డులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గతంలో బంగ్లాదేశ్ జట్టుతో కలిపి ఒక ట్రై సిరీస్ ఆడదామని ప్రతిపాదించినప్పటికీ బీసీసీఐ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ప్రస్తుతం దుబాయ్‌లో జరగబోయే ఎఫ్‌టీపీ సమావేశం తరవాత బీసీసీఐ తన అధికారిక వైఖరిని స్పష్టం చేసే అవకాశముంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us