India vs Japan: భారత్, జపాన్ క్రికెట్ చరిత్రలోనే అపూర్వ ఘట్టం.. ఆ రోజే టీమిండియా టీ20 మ్యాచ్

India vs Japan: భారత్, జపాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారి పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 22న జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ పోరు నిర్వహించనున్నారు. ఇరు దేశాల దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవంలో భాగంగా ‘సుజుకి కప్’, ‘స్పోర్ట్ 75’ కార్యక్రమాలకు ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తూర్పు ఆసియాలో క్రికెట్ విస్తరణకు ఇది కీలక ముందడుగు కానుంది.

India vs Japan: భారత్, జపాన్ క్రికెట్ చరిత్రలోనే అపూర్వ ఘట్టం.. ఆ రోజే టీమిండియా  టీ20 మ్యాచ్
India Vs Japan

Updated on: Sep 04, 2026 | 6:08 PM

India vs Japan: బీసీసీఐ క్రీడాభిమానులకు ఒక ఊహించని సంచలన వార్త అందించింది. భారత్, జపాన్ పురుషుల జట్ల మధ్య సెప్టెంబర్ 22న ఒక చారిత్రాత్మక టి20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఇరు దేశాల దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చారిత్రాత్మక మ్యాచ్‎ను నిర్వహిస్తున్నారు. భారత క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక నూతన అధ్యాయానికి నాంది కానుంది. జపాన్, భారత్ పురుషుల క్రికెట్ జట్లు అంతర్జాతీయ స్థాయిలో ఒక మ్యాచ్‌లో తలపడటం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ క్రికెట్ శక్తిగా వెలుగొందుతున్న టీమిండియా, ఇప్పుడిప్పుడే క్రికెట్ రంగంలో అడుగులు వేస్తున్న జపాన్ మధ్య జరిగే ఈ మ్యాచ్ సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనుంది. తోచిగి ప్రావిన్స్‌లో ఉన్న ఈ స్టేడియంలో సెప్టెంబర్ 22న ఈ మ్యాచ్ నిర్వహించనున్నట్లు బిసిసిఐ అధికారికంగా వెల్లడించింది.

ఇరు దేశాల ప్రధానుల చొరవతో స్పోర్ట్ 75

భారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య బంధం మొదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. జపాన్ ప్రధాని సనా యె తకైచి, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల ఫలంగా రూపుదిద్దుకున్న స్పోర్ట్ 75 కార్యక్రమానికి ఇది తొలి పునాది. క్రీడల ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యం. 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలను నిర్వహించాలనే భారత్ ఆశయానికి జపాన్ సహకారం ఎంతగానో తోడ్పడనుంది.

తూర్పు ఆసియాలో క్రికెట్ విస్తరణకు బీసీసీఐ అడుగులు

ఈ చారిత్రాత్మక సంఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. జపాన్ వేదికగా రెండు దేశాల పురుషుల జట్లు టీ20 మ్యాచ్ ఆడటం క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద మలుపు అని ఆయన కొనియాడారు. భారత జట్టు సరికొత్త వేదికపై అడుగుపెట్టడం వల్ల తూర్పు ఆసియా ప్రాంతంలో క్రికెట్ ఆదరణ ఊపందుకుంటుందని, బీసీసీఐ ఈ అద్భుతమైన చొరవలో భాగస్వామి కావడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.

ఒలింపిక్ కల వైపు అడుగులు

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలని భారత్ పట్టుదలతో కృషి చేస్తోంది. జపాన్ వంటి క్రీడా రంగానికి పెద్దపీట వేసే దేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాల మార్పిడి వేగవంతమవుతాయి. క్రికెట్ మ్యాచ్ ద్వారా మొదలవుతున్న ఈ భాగస్వామ్యం రాబోయే రోజుల్లో ఇతర క్రీడలకు విస్తరించి ఇరు దేశాల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేయనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us