
India vs Ireland T20 series 2026: భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్ ముగింపు దశకు చేరుకుంది. జూన్ 20న చెన్నై వేదికగా జరిగే చివరి వన్డేతో ఈ సిరీస్ ముగియనుంది. ఆ వెంటనే భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. అక్కడ ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే 16 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. కానీ, ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. జట్టులో చోటు సంపాదించినప్పటికీ, అక్కడి పరిస్థితులు, సమీకరణాల వల్ల ఐదుగురు ఆటగాళ్లు కేవలం బెంచ్కే పరిమితమై, పర్యాటకులుగా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
ఈ జాబితాలో అందరినీ ఆశ్చర్యపరిచే మొదటి పేరు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026 సీజన్లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఈ యువ కింగ్, తన అద్భుత ప్రదర్శనతో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు భారత జట్టులో స్థానం సంపాదించాడు. అయితే, ప్రస్తుత సమీకరణాల ప్రకారం ఐర్లాండ్ సిరీస్లో అతనికి తుది జట్టులో అవకాశం రావడం కష్టంగా మారింది. ఎందుకంటే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ జోడీనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ యువ సంచలనం తన అరంగేట్రం కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
మరోవైపు, సీనియర్ వేగవంతమైన బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు కూడా తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగానే ఉంది. అర్ష్దీప్ సింగ్తో పాటు హర్షిత్ రాణా అద్భుతమైన ఫామ్లో ఉండటమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు జట్టులో శివమ్ దూబే, నితీష్ రాణా రూపంలో ఇద్దరు పేస్ ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్నారు. బ్యాటింగ్ లోతును పెంచేందుకు వీరికే యాజమాన్యం మొగ్గు చూపవచ్చు. ఐపీఎల్లో అదరగొట్టిన మరో యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ పరిస్థితి కూడా ఇంతే. బ్యాటింగ్లో పెద్దగా రాణించలేకపోవడం, ముగ్గురు ప్రత్యేక సీమర్లతోనే బరిలోకి దిగాలనే భారత్ వ్యూహం వల్ల ప్రిన్స్ యాదవ్ కేవలం డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం కావలసి రావచ్చు.
కుల్దీప్ యాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్కు కూడా గట్టి పోటీ ఎదురవుతోంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తుండటంతో, స్పిన్ విభాగంలో అతనికే మొదటి ప్రాధాన్యత దక్కనుంది. ఇక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. అక్షర్ పటేల్ జట్టులో ఉండటం సుందర్కు మైనస్గా మారింది. అక్షర్ అటు బౌలింగ్తో పాటు ఇటు బ్యాటింగ్లోనూ నిలకడగా రాణిస్తూ జట్టుకు నమ్మకమైన ఆటగాడిగా మారాడు. దీనికి భిన్నంగా సుందర్ ఈ ఫార్మాట్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో అతనికి తుది జట్టులో చోటు దక్కడం దాదాపు అసాధ్యమే.
ప్రతిభ ఉన్నప్పటికీ జట్టులోని తీవ్రమైన పోటీ కారణంగా ఈ ఐదుగురు ఆటగాళ్లకు ఐర్లాండ్ పర్యటనలో నిరాశే ఎదురయ్యేలా ఉంది. అయితే, సుదీర్ఘమైన సీజన్ ముందున్న నేపథ్యంలో బెంచ్ బలాన్ని పరీక్షించడానికి యాజమాన్యం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..