
India vs Afghanistan T20 Series: క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ చూడని ఒక అద్భుతమైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. భారత గడ్డపై టీమ్ ఇండియాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒక చారిత్రాత్మక సిరీస్కు సిద్ధమవుతోంది. అయితే ఇందులో అసలైన ట్విస్ట్ ఏమిటంటే, మ్యాచ్లు భారత్లో జరిగినప్పటికీ ఈ సిరీస్కు పూర్తి ఆతిథ్య హక్కులు మాత్రం ఆఫ్ఘనిస్తాన్వే కావడం విశేషం. ఈ అరుదైన పోరు క్రీడాభిమానులను ఎంతగానో అలరించనుంది.
సరిహద్దు దేశమైన ఆఫ్ఘనిస్తాన్తో భారత్ ఈ ఏడాది సెప్టెంబర్లో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. సాధారణంగా భారత్లో మ్యాచ్లు జరిగితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆతిథ్యం ఇస్తుంది. కానీ, ఈ సిరీస్లో మాత్రం అరుణ్ జైట్లీ స్టేడియం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు హోమ్ గ్రౌండ్గా మారనుంది. అంటే, మన దేశంలోనే మన ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుకు అతిథులుగా మారబోతున్నారు. క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడంతో ఈ సిరీస్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. సెప్టెంబర్ 13, 16, 19 తేదీల్లో ఈ మూడు మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది.
యుద్ధాలు, అంతర్గత కల్లోలాలు, ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్తాన్ దేశంలో క్రికెట్ ప్రతిభకు కొదవలేదు. మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఎందరో అక్కడ పుట్టుకొచ్చారు. కానీ అక్కడ అంతర్జాతీయ స్థాయి మైదానాలు, వసతులు లేకపోవడం ఆ జట్టుకు పెద్ద శాపంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీసీసీఐ ఆ దేశానికి అండగా నిలిచింది. గతంలో గ్రేటర్ నోయిడా, డెహ్రాడూన్ మైదానాలను ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు హోమ్ గ్రౌండ్స్గా వాడుకోవడానికి అనుమతించింది. ఇప్పుడు ఢిల్లీ మైదానం వారికి మూడో హోమ్ గ్రౌండ్గా మారబోతోంది. ఐర్లాండ్, జింబాబ్వే వంటి బోర్డులను ఆదుకున్నట్లే, ఆఫ్ఘన్ బోర్డు ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి బీసీసీఐ ఈ చారిత్రాత్మక నిర్ణయానికి అంగీకరించింది.
ఇది కూడా చదవండి: Video: ఆర్సీబీకి దిమ్మతిరిగే షాక్.. స్టార్ ప్లేయర్పై నిషేధంతోపాటు జరిమానా..!
ఈ టీ20 సిరీస్ కంటే ముందే, జూన్ 6 నుంచి 10 వరకు ముల్లన్పూర్ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత భారత జట్టు తన తదుపరి లక్ష్యమైన 2027 వన్డే ప్రపంచకప్ కోసం ముందస్తు సన్నద్ధతను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్లు ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరగనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన తర్వాతే, సెప్టెంబర్లో చారిత్రాత్మక టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..