
WTC Points Table : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తాజా పాయింట్స్ టేబుల్లో భారత జట్టుకు భారీ నష్టం జరిగింది. న్యూజిలాండ్ తమ రెండవ టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ను 9 వికెట్ల తేడాతో ఓడించి, పట్టికలో అనూహ్యంగా ముందుకు దూకింది. ఈ పరిణామాల కారణంగా భారత జట్టు మరింత వెనుకబడింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో పాకిస్తాన్ కూడా భారత్ కంటే ముందు ఉండటం గమనార్హం. వెస్టిండీస్పై విజయం సాధించిన తరువాత న్యూజిలాండ్ ఆరో స్థానం నుంచి మూడవ స్థానానికి చేరుకుంది.
2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత అయిన ఆస్ట్రేలియా జట్టు 100 పాయింట్స్ శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా యాషెస్ 2025-26 సిరీస్లో ఇంగ్లండ్పై 2-0 ఆధిక్యంలో ఉంది. ఇక ఇటీవల భారత్ను వారి సొంత గడ్డపై టెస్ట్ సిరీస్లో 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా జట్టు రెండవ స్థానంలో ఉంది. వెస్టిండీస్పై గెలుపుతో న్యూజిలాండ్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మార్పుల కారణంగా శ్రీలంక కూడా ఒక స్థానం దిగజారి నాలుగో స్థానానికి పడిపోయింది.
న్యూజిలాండ్ దూకుడు కారణంగా భారత జట్టు ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ కేవలం 48.15% పాయింట్స్ శాతంతో ఉంది. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 100% పాయింట్స్ శాతంతో ఉండటం వలన, టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకునే ఆశలు తగ్గుతున్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా పాయింట్స్ టేబుల్లో పాకిస్తాన్ కూడా భారత్ కంటే ముందు ఐదవ స్థానంలో ఉంది. ఒకవేళ యాషెస్ సిరీస్లో మిగిలిన 3 మ్యాచ్లలో ఇంగ్లండ్ గనుక పుంజుకుంటే, భారత జట్టు ఏకంగా ఏడవ స్థానానికి కూడా పడిపోయే ప్రమాదం ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రస్తుత సైకిల్లో భారత్ ఇప్పటివరకు 9 టెస్టులు ఆడి కేవలం నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసింది.
భారత్ తదుపరి టెస్ట్ సిరీస్ ఎప్పుడు?
భారత జట్టు ఇప్పుడు దాదాపు 8 నెలల పాటు ఎలాంటి టెస్ట్ సిరీస్ ఆడదు. టీమిండియా తదుపరి టెస్ట్ సిరీస్ ఆగస్టు 2026 లో శ్రీలంకతో జరగనుంది. 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే, భారత్ మిగిలిన మ్యాచ్లలో అత్యధికంగా గెలవాల్సిన అవసరం ఉంది.