
ICC Test Rankings:క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐసీసీ తాజాగా బుధవారం అంటే జూలై 30న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ఐదో టెస్ట్కు ముందు కొత్త టెస్ట్ ర్యాంకింగ్స్ను ప్రకటించింది. ఇందులో భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచారు. మ్యాంచెస్టర్లో సెంచరీతో అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్కు, ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ర్యాంకింగ్స్లో ప్రమోషన్ లభించింది. అయితే, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు స్థానాలు కిందకు పడిపోయాడు.
ప్రస్తుతం భారత ఆటగాళ్లలో టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ అందరికంటే ముందున్నారు. ఆయన 776 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. కెప్టెన్ శుభమన్ గిల్ తొమ్మిదో స్థానంలో తన పట్టు నిలుపుకున్నారు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జో రూట్ 904 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
గతంలో ఐదో స్థానంలో ఉన్న యశస్వి జైస్వాల్, తాజా ర్యాంకింగ్స్లో మూడు స్థానాలు కిందకు పడిపోయి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. అతని ఖాతాలో 769 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఒక స్థానం పైకి ఎగబాకి 14వ స్థానంలో నిలిచాడు. అతనికి 682 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా 898 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మ్యాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్ట్లో తన కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకం నమోదు చేసిన వాషింగ్టన్ సుందర్, ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో నిలిచాడు. అతనికి 193 పాయింట్లు ఉన్నాయి. ఈ అద్భుత ప్రదర్శనతో సుందర్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..