
ODI World Cup 2027 : భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు 2027 వన్డే ప్రపంచకప్ ముందస్తు వ్యూహాలపై అప్పుడే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాబోయే ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్కు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపికైనప్పటికీ.. 39 ఏళ్ల హిట్మ్యాన్ ఫిట్నెస్, వర్క్లోడ్ మేనేజ్మెంట్ భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారనుంది. మెగా టోర్నమెంట్ సమయానికి రోహిత్ అందుబాటులో లేకపోతే బ్యాకప్ ప్లాన్స్ ఏంటనే దానిపై సెలక్టర్లు సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. వరల్డ్ కప్కు ముందు భారత్ ఆడే వన్డేల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో.. రోహిత్ శర్మ స్థానంలో బరిలోకి దిగగల 3 అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్లను మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. ఆ క్రేజీ జంటల లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం.
1. ఇషాన్ కిషన్ – శుభ్మన్ గిల్
రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే సెలక్టర్ల మొదటి ఛాయిస్ ఖచ్చితంగా ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ జంటనే కానుంది. ఈ ఇద్దరి మధ్య మైదానంలో మంచి కెమిస్ట్రీ ఉంది. అలాగే లెఫ్ట్-రైట్ కాంబినేషన్ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. 2023 తర్వాత వన్డేలకు దూరమైన ఇషాన్ కిషన్.. దేశీవాళీ టోర్నీలతో పాటు ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 లో 13 ఇన్నింగ్స్ల్లో 490 రన్స్ చేసి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. టి20 వరల్డ్ కప్లో కూడా 193 స్ట్రైక్ రేట్తో 317 రన్స్ బాదాడు. వన్డేల్లో ఇషాన్కు 42.40 సగటుతో 933 పరుగులు ఉన్నాయి (ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు). గతంలో వెస్టిండీస్పై ఈ జంట నమోదు చేసిన 143 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యమే కరేబియన్ గడ్డపై భారత్కు అత్యుత్తమ రికార్డు. వీరిద్దరూ కలిసి వన్డేల్లో ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్ల్లో 592 పరుగులు చేశారు.
2. శుభ్మన్ గిల్ – రుతురాజ్ గైక్వాడ్
ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్కు ఎంపిక కాకపోయినప్పటికీ.. భవిష్యత్తు వన్డే ప్లాన్స్లో రుతురాజ్ గైక్వాడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టెక్నికల్గా చాలా క్లాస్ బ్యాటింగ్ చేసే రుతురాజ్.. ఇన్నింగ్స్ను నిలకడగా నిర్మించగలడు. సౌతాఫ్రికాపై 83 బంతుల్లో 105 రన్స్ చేసిన సూపర్ రికార్డ్ ఇతనికి ఉంది. అలాగే విజయ్ హజారే ట్రోఫీ (2025-26) లో 7 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలతో 412 పరుగులు చేసి పీక్ ఫామ్లో ఉన్నాడు. గిల్, రుతురాజ్ జంట వన్డేల్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనే 169 పరుగులు జోడించి ప్రామిసింగ్ సైన్స్ చూపించింది. ఈ జంట క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు పరుగుల వేటతో పాటు వికెట్ తీయడం హిమాలయ పర్వతం ఎక్కినంత కష్టమవుతుంది.
3. శుభ్మన్ గిల్ – యశస్వి జైస్వాల్
క్రికెట్ విశ్లేషకులు, మాజీలు సైతం టీమిండియా భవిష్యత్తు ఓపెనింగ్ జోడీగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ లనే గట్టిగా ఓటు వేస్తున్నారు. వీరిద్దరూ యువ రక్తం, భయం లేని దూకుడుతో పాటు అద్భుతమైన టైమింగ్ ఉన్న ప్లేయర్స్. యశస్వి జైస్వాల్ వన్డేల్లో ఆడింది తక్కువ మ్యాచ్లే అయినా.. సౌతాఫ్రికాపై తన 3వ వన్డేలోనే 121 బంతుల్లో నాటౌట్గా 116 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. జైస్వాల్ అటాకింగ్ మైండ్సెట్, గిల్ కంపోజ్డ్ ఇన్నింగ్స్ తోడైతే పవర్ప్లేలోనే ప్రత్యర్థి జట్లకు చుక్కలు కనిపించడం ఖాయం. రోహిత్ శర్మ లేని లోటును ఈ యువ ద్వయం సునాయాసంగా భర్తీ చేయగలదని మేనేజ్మెంట్ గట్టి నమ్మకంతో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..