తొలుత వద్దన్నారని హాలీడే ప్లాన్.. కట్‌చేస్తే.. ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ

From Holiday Plans to Team India Hero: హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ 18 నెలలుగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడలే. కానీ, హర్షిత్ రాణా గాయంతో రాత్రికే రాత్రే టీమిండియా కెప్టెన్ నుంచి ఫోన్ రావడంతో షాక్ అయ్యాడు. ఆ వెంటనే బరిలోకి దిగి టీమిండియాకు విజయాన్ని అందించాడు.

తొలుత వద్దన్నారని హాలీడే ప్లాన్.. కట్‌చేస్తే.. ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
Mohammed Siraj

Updated on: Feb 08, 2026 | 4:28 PM

Mohammed Siraj’s One-Night Turnaround in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో తొలుత సెలెక్టర్లు వద్దనుకున్నారు. దీంతో జర్మనీలో దీర్ఘకాలిక సెలవులు గడిపేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అలాగే స్పెయిన్‌కు వెళ్లి రియల్ మాడ్రిడ్ మ్యాచ్ చూడ్డానికి కూడా ప్లాన్ చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న తన స్నేహితులకు ఈ ప్లాన్ గురించి తెలిపాడు. అయితే, ఈలోపే భారత జట్టు ట్రైనర్ అడ్రియన్ లె రూక్స్ నుంచి కాల్ వచ్చింది. తనను డిస్టర్బ్ చేయవద్దని, నేను భారీగా ప్లాన్ చేసుకున్నాను అని కూడా చెప్పాడు. కానీ, శుక్రవారం రాత్రి వరకు ముంబైకి రావాల్సిన అవసరం ఏంటో చెప్పాడు. భారత జట్టు నుంచి పిలుపు రావడంతో.. తన టూర్ ప్లాన్ మొత్తం క్యాన్సిల్ చేసుకున్నాడు. వెంటనే దేశం తరపున తన బాధ్యతను నెరవేర్చేందుకు ముంబై వెళ్లాడు. వెంటనే టీమిండియా ప్లేయింగ్ 11లో పేరు చూసి షాకయ్యాడు. ఆ వెంటనే అంటే, 24 గంటల లోపే, అమెరికా జట్టుతో జరిగిన కఠినమైన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో హీరోగా మారి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాడు మన హైదరాబాదీ పేసర్ సిరాజ్. 24 గంటల్లో తన ప్లాన్ ఎలా మారిపోయిందో గుర్తు చేసుకుని షాక్ అయ్యాడు సిరాజ్. ఈ క్రమంలో ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో అసలేం జరిగిందో సిరాజ్ చెప్పుకొచ్చాడు.

రెడీ అవ్వు.. బ్యాగ్ సర్దుకో అంటూ కాల్..

ఆయన మాటల్లోనే.. “అప్పుడే సడెన్‌గా సూర్య భాయ్ (కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్) నాకు కాల్ చేశాడు. ‘రెడీ అవ్వు, బ్యాగ్ సర్దుకో, వచ్చేయి’ అన్నాడు. నేను ‘సూర్య భాయ్, జోక్ చేయొద్దు, ఇది జరగదు’ అన్నాను. ఆయన ‘నిజం చెబుతున్నాను, రెడీ అవ్వు’ అన్నాడు. ఫోన్ పెట్టిన వెంటనే నేషనల్ సెలెక్టర్ (ప్రజ్ఞాన్) ఓజా నుంచి కాల్ వచ్చింది. అలా ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ తెలిసింది” అంటూ సిరాజ్ తెలిపాడు.

దేవుడు రాసిన విధి..

గాయపడిన హర్షిత్ రాణా స్థానంలో భారత జట్టులో చేరేందుకు మహ్మద్ సిరాజ్‌కు బ్యాగులు సర్దుకుని వెంటనే ముంబైకి ఫ్లైట్ ఎక్కేందుకు చాలా తక్కువ సమయం మాత్రమే దొరికింది. “దేవుడు రాసిన విధిని ఎవరూ మార్చలేరు. నేను వచ్చాను, మ్యాచ్ ఆడాను – అన్నీ ముందే రాసి ఉన్నాయి. దేవుడు గొప్పవాడు. దాని మించినది ఎవరూ చేయలేరు” అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు.

24 గంటల్లో మారిన సీన్..

కానీ, నిన్న రాత్రి సిరాజ్ ప్రదర్శన చాలా కొద్ది మంది ఆటగాళ్లు మాత్రమే చేయగలిగేది. నేరుగా ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి ఎంపికై, కొత్త బంతితో అద్భుతమైన స్పెల్ వేసి కీలకమైన రెండు వికెట్లు తీశాడు. ముఖ్యంగా భారత్ 161 అనే తక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేస్తున్న సమయంలో ఈ బ్రేక్‌థ్రూలు చాలా కీలకంగా మారాయనే సంగతి తెలిసిందే.

ప్రాక్టీస్ లేకుండా బరిలోకి..

యూఎస్ఏ స్కోర్ 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత 13 పరుగులకే మూడో వికెట్ పడిపోయింది. తొలి నాలుగు ఓవర్లలోనే మ్యాచ్ గెలుపు–ఓటములు నిర్ణయించబడ్డాయి అనుకోవచ్చు. సిరాజ్ చివరకు 3 వికెట్లకు 29 పరుగులు ఇచ్చాడు. మ్యాచ్ చివరి బంతికి మరో వికెట్ తీసి, పవర్‌ప్లేలో తీసుకున్న రెండు కీలక వికెట్లకు తోడు మూడో వికెట్‌ను జోడించిన సంగతి తెలిసిందే.

18 నెలలుగా ఆడలే..

సిరాజ్ గత 18 నెలలుగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. చివరిసారిగా 2024 జులైలో శ్రీలంకతో ఆడాడు. వరల్డ్‌కప్ క్యాంపెయిన్‌లో తాను భాగం కాదని భావించి, హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా రంజీ మ్యాచ్‌లు పూర్తిచేసిన తర్వాత విశ్రాంతి కావాలని భారత జట్టు ట్రైనర్‌కు కూడా చెప్పాడు. తరువాత అతను, “దేవుడు నా విధిని మార్చాడు” అని అన్నాడు.

2 వికెట్లతో టీమిండియాకు బ్రేక్ త్రూ..

సిరాజ్ రీటర్న్ ఓ అద్భుతమైన ఫెయిరీ టేల్ లాంటిది. ఇలాంటి క్రీడా విజయ కథలే మనకు స్ఫూర్తినిస్తాయి. తక్కువ నోటీసులో జట్టులో చేరడమే కాకుండా, సిద్ధమయ్యేందుకు ఎక్కువ సమయం లేకుండానే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. పైగా ప్రధాన బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో బాధ్యత మరింత పెరిగింది. బుమ్రా లేకపోయినప్పుడు సిరాజ్ పై అంచనాలు భారీగా ఉంటాయి. టీ20ఐకి తిరిగొచ్చిన తొలి రెండు ఓవర్లలోనే వికెట్లు తీసి ఆ పేరు నిలబెట్టుకున్నాడు ఈ హైదరాబాదీ పేసర్.

విరామం ఎలాంటి అడ్డంకి ఇవ్వలే..

18 నెలల విరామం సిరాజ్‌కు ఎలాంటి అడ్డంకిగా మారలేదు. 112 అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవం, దాదాపు 10 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ అనుభవం అతనికి వెంటనే లైన్ అండ్ లెంగ్త్ పట్టుకునేలా చేశాయి. “నేను దాదాపు 10 ఏళ్లుగా భారత జట్టుకు ఆడుతున్నాను. అవకాశం వచ్చినప్పుడు ఎలా సిద్ధం కావాలో నాకు తెలుసు. ఒక యువ ఆటగాడికి అవకాశం వస్తే చాలా విషయాలు ఆలోచించాలి. కానీ జట్టుతో ఉండటం వల్ల ఈ ఫార్మాట్‌లో ఎలా సిద్ధం కావాలో, మైండ్‌సెట్ ఎలా పెట్టుకోవాలో నాకు తెలుసు. నిన్న రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా, ఇప్పటివరకు నాకు విజయాన్ని ఇచ్చిన అదే ఆయుధాన్ని ఉపయోగించాలని అనుకున్నాను.

అదే ప్లాన్‌తో బరిలోకి..

“రంజీ ట్రోఫీలో వేసినట్లే అదే లైన్, అదే లెంగ్త్‌తో బౌలింగ్ చేశాను. మనం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొత్త బంతిని కొట్టడం అంత ఈజీగా లేదని అనిపించింది. అందుకే కొత్త బంతితో వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయాలని ప్లాన్ చేశాను. అక్కడ వికెట్ పడితే జట్టుకు చాలా ఉపయోగపడుతుందని అనుకున్నాను” నిజంగానే అది జట్టుకు విజయం తీసుకొచ్చింది అంటూ తన ప్లాన్ వివరించాడు సిరాజ్ మియా.

కొత్త బంతితో దుమ్మురేపిన హైదరాబాదీ..

సిరాజ్ తన కొత్త బంతి భాగస్వామి అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంతో ప్రశంసించాడు. పవర్‌ప్లేలో ఆరు ఓవర్లూ ఇద్దరూ కలిసి బౌలింగ్ చేసి అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. “ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది, ముఖ్యంగా అర్ష్‌దీప్ వైపు నుంచి. అతను వేసిన మూడు ఓవర్లు ప్రత్యర్థి మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయి. దాని వల్లే మనకు ఈ ఫలితం వచ్చింది” అని తెలిపాడు. అర్ష్‌దీప్ చివరకు 2 వికెట్లకు 18 పరుగులు ఇచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..