
IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇప్పటికే టీమిండియా 3 మ్యాచ్లలో రెండు ఓడిపోగా, ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీనితో సిరీస్లో వెనుకబడిన భారత్, తన సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే బ్రిస్టల్లో జరగబోయే నాలుగో టీ20 మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఈ చావో రేవో పోరు జట్టుకే కాకుండా, టీమిండియా యువ ఓపెనర్, యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి కూడా అత్యంత కీలకంగా మారింది. ఇంటర్నేషనల్ కెరీర్లో ఆశించిన స్థాయిలో ఆరంభం లభించని వైభవ్, తన మూడో మ్యాచ్లోనైనా పాత ఐపీఎల్ హిస్టరీని రిపీట్ చేస్తాడా అనే ఆశతో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సంజూ శాంసన్ స్థానంలో జట్టులోకి ఎంట్రీ
భారత జట్టు మేనేజ్మెంట్ ఈ ఇంగ్లాండ్ టూర్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఐర్లాండ్ సిరీస్తో పాటు ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లోనూ వరసగా విఫలమైన సీనియర్ ఓపెనర్ సంజూ శాంసన్పై వేటు పడింది. యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్స్ రావడంతో, రెండో టీ20 మ్యాచ్ ద్వారా అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అయితే, ఆడిన మొదటి రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్లలో వైభవ్ వరుసగా 14 పరుగులు, 13 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్ల్లోనూ అతని బ్యాటింగ్లో అగ్రెసివ్ షాట్లు, సిక్సర్లు బాదగల విస్ఫోటక శైలి కనిపించినప్పటికీ, ఆ హిట్టింగ్ను పెద్ద ఇన్నింగ్స్గా మార్చడంలో అతను విఫలమయ్యాడు.
హిస్టారికల్ ఐపీఎల్ సెంటిమెంట్
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన మొదటి రెండు మ్యాచ్లలో ఫెయిల్ అయినప్పటికీ, క్రికెట్ పండితులు అతనిపై గట్టి నమ్మకంతో ఉన్నారు. దీనికి కారణం అతని ఐపీఎల్ కెరీర్ లోని ఒక అద్భుతమైన సెంటిమెంట్. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025 సీజన్ ద్వారా లీగ్లోకి అరంగేట్రం చేశాడు. తన మొదటి ఐపీఎల్ మ్యాచ్లోనే 20 బంతుల్లో 34 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, రెండో మ్యాచ్లో కేవలం 16 పరుగులకే అవుటయ్యాడు. కానీ, తన కెరీర్లోని మూడో ఐపీఎల్ మ్యాచ్లో వైభవ్ ఏకంగా విశ్వరూపం చూపించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ బౌలర్లను ఉతికేస్తూ, కేవలం 34 బంతుల్లోనే శతకం బాదాడు. మొత్తం 38 బంతుల్లో 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్ను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు.
ఇంగ్లాండ్ గడ్డపై సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
ఐపీఎల్లో జరిగినట్లే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా తన మూడో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ అదే మ్యాజిక్ను రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వైభవ్కు ఒక అద్భుతమైన రికార్డ్ ఉంది; తన చిన్న కెరీర్లోనే జట్టుకు అత్యంత అవసరమైన, ప్రెజర్ ఎక్కువగా ఉండే డూ ఆర్ డై మ్యాచ్ల్లోనే అతను ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఐపీఎల్ అయినా, అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ అయినా, లేదా ఇటీవలే జరిగిన ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ అయినా.. వైభవ్ ఎల్లప్పుడూ ఒత్తిడిని జయించి గేమ్ ఛేంజర్ ఇన్నింగ్స్లు ఆడాడు. ఇప్పుడు బ్రిస్టల్లో జరగబోయే మ్యాచ్ కూడా టీమిండియాకు అలాంటిదే కాబట్టి, వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్తో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడి భారత్కు విజయాన్ని అందిస్తాడని అందరూ బలంగా నమ్ముతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..