IND vs ENG : టీమిండియా పరువు కోసం ఆఖరి పోరాటం.. సౌతాంప్టన్ టీ20 తుది జట్టులో భారీ మార్పులు

IND vs ENG : ఇంగ్లాండ్‌తో చివరి టీ20లో పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. సంజూ శాంసన్ రీఎంట్రీతో పాటు ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్లీన్ స్వీప్ తప్పించుకోవడం, ఐసీసీ నంబర్-1 ర్యాంక్ కాపాడుకోవడం భారత్‌కు కీలకం.

IND vs ENG : టీమిండియా పరువు కోసం ఆఖరి పోరాటం.. సౌతాంప్టన్ టీ20 తుది జట్టులో భారీ మార్పులు
Ind Vs Eng 5th T20

Updated on: Jul 11, 2026 | 3:27 PM

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఆఖరి దశకు చేరుకుంది. సౌతాంప్టన్ వేదికగా ఐదో, చివరి టీ20 మ్యాచ్ జరగబోతోంది. అయితే, భారత జట్టు ఇప్పటికే ఈ సిరీస్‌ను చేజార్చుకోవడంతో, కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కాపాడుకోవాలన్నా, క్లీన్ స్వీప్ అవమానం తప్పాలన్నా ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ప్లేయింగ్ ఎలెవన్‎లో కొన్ని కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా గత కొన్ని మ్యాచ్‌లుగా బెంచ్‌కే పరిమితమైన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మళ్లీ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

సంజూ శాంసన్ రీ-ఎంట్రీ ఖాయం

ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న.. సంజూ శాంసన్ జట్టులోకి వస్తే ఎవరి స్థానానికి ఎసరు పెడతాడు. గత మ్యాచ్‌ల్లో శాంసన్‌ను పక్కనబెట్టి 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 14 సగటుతో 42 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో తన సహచర బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వైభవ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒకవేళ వైభవ్‌ను పక్కనబెట్టకపోతే, ఫామ్ లేమితో సతమతమవుతున్న ఇషాన్ కిషన్ లేదా కెప్టెన్ తిలక్ వర్మలలో ఒకరిపై వేటు పడే అవకాశం ఉంది. ఇషాన్ 4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 66 పరుగులు చేయగా, తిలక్ వర్మ మొదటి 4 మ్యాచ్‌ల్లో 51 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యారు.

టాప్ ఆర్డర్‌లో రైట్ హ్యాండ్ బ్యాటర్ అవసరం

సంజూ శాంసన్ గనుక తుది జట్టులోకి వస్తే భారత టాప్ ఆర్డర్‌లో ఒక రైట్ హ్యాండ్ బ్యాటర్ అందుబాటులోకి వస్తాడు. ఇది జట్టు సమతుల్యతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శాంసన్‌తో పాటు ఈ ఆఖరి మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ సూర్యాంశ్ శెడ్గేకు కూడా అవకాశం దక్కవచ్చని ఇన్‌సైడ్ టాక్. ప్రస్తుతానికి పేలవ ఫామ్‌లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్థానంలో సూర్యాంశ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. సూర్యాంశ్ కూడా రైట్ హ్యాండ్ బ్యాటర్ కావడంతో మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం అవుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. సిరీస్ ఎలాగూ చేజారిపోయింది కాబట్టి, బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించేందుకు కూడా ఈ మ్యాచ్‌ను వేదికగా చేసుకోవాలని చూస్తున్నారు.

ఐదో టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత అంచనా జట్టు ఇదే

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ/సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే/సూర్యాంశ్ శెడ్గే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us