Shubman Gill : ట్రిపుల్ సెంచరీ మిస్.. తల్లిదండ్రుల మెసేజ్ చూసి ఎమోషనల్ అయిన శుభమాన్ గిల్

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించి, ట్రిపుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. బీబీసీ ఇంటర్వ్యూలో తల్లిదండ్రులు పంపిన మెసేజ్ చూసి శుభ్‌మన్ గిల్ ఎమోషనల్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో టీం ఇండియా 587 పరుగులు చేసింది.

Shubman Gill : ట్రిపుల్ సెంచరీ మిస్.. తల్లిదండ్రుల మెసేజ్ చూసి ఎమోషనల్ అయిన శుభమాన్ గిల్
Shubman Gill

Updated on: Jul 04, 2025 | 2:54 PM

Shubman Gill : టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో అదరగొట్టాడు. కెప్టెన్‌గా తనకి ఇది రెండో మ్యాచ్, రెండు మ్యాచ్‌ల్లోనూ సెంచరీ కొట్టేశాడు. గురువారం ఏకంగా డబుల్ సెంచరీ కూడా కొట్టాడు. కానీ, దురదృష్టవశాత్తు ట్రిపుల్ సెంచరీ మిస్ అయింది. ఈ విషయం తన తల్లిదండ్రులకు కూడా చాలా బాధ కలిగించింది. రెండో రోజు ఆట అయిపోయాక, శుభ్‌మన్ గిల్ తల్లిదండ్రులు తనకి ఒక స్పెషల్ మెసేజ్ పంపించారు. దాన్ని శుభమాన్ గిల్ బీసీసీఐ ఇంటర్వ్యూలో చదివి వినిపించాడు. బీసీసీఐ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో స్టేడియం బయట, హోటల్ దగ్గర అభిమానులు చాలా మంది గుమిగూడి, డప్పులు కొడుతూ సందడి చేస్తున్నారు. గిల్ హోటల్ బయట ఆగి, ఒక పిల్లాడికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం కనిపిస్తుంది. ఆ తర్వాత తన తల్లిదండ్రులు పంపిన మెసేజ్‌ని చదివాడు.

శుభ్‌మన్ గిల్ తండ్రి… “నువ్వు చాలా బాగా ఆడావు. ఈరోజు నీ బ్యాటింగ్ చూడడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. చిన్నప్పుడు, అండర్-16 నుంచి అండర్-19 వరకు నువ్వు ఎలా ఆడేవాడివో అలానే ఆడావు. నాకు చాలా గర్వంగా ఉంది” అని చెప్పారు. అమ్మ కూడా “నీ బ్యాటింగ్ నాకు చాలా నచ్చింది. ఇలాగే ఆడుతూ ఉండు. నీకు ఆల్ ది బెస్ట్” అంటూ ఆశీర్వదించింది.

ఈ మెసేజ్ చూసి శుభ్‌మన్ గిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. గిల్ మాట్లాడుతూ.. “ఈ మెసేజ్ నాకెంతో ముఖ్యం. నేను క్రికెట్ ఆడేది మా నాన్న కోసమే. క్రికెట్ విషయానికి వస్తే, నేను కేవలం ఇద్దరి మాటలే వింటాను. మా నాన్న, నా బెస్ట్ ఫ్రెండ్. ట్రిపుల్ సెంచరీ మిస్సయ్యావని ఆయన కూడా నాతో అన్నారు” అని గిల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగులు చేసి చాలా రికార్డులు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఇండియా తరపున కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంకెన్నో రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. రెండో టెస్టులో టీమిండియా చాలా మంచి స్థితిలో ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..