IND vs AFG: భారత్-ఆఫ్ఘాన్ పోరులో ఆ 3 యుద్ధాలే కీలకం.. ఎవరు గెలిస్తే మ్యాచ్ వారిదే!
IND vs AFG: భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఢిల్లీ వేదికగా నేడు ఆరంభమయ్యే తొలి టీ20 మ్యాచ్లో మూడు కీలకమైన ఆటగాళ్ల సమరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మైదానంలో గెలుపోటములను శాసించే ఈ వ్యక్తిగత పోరాటాలపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

IND vs AFG: భారత్-ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20కి రంగం సిద్ధమైంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తున్న వేళ.. ఇరు జట్లలోని స్టార్ ఆటగాళ్ల మధ్య జరిగే కొన్ని వ్యక్తిగత పోరాటాలు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. బుమ్రా-గుర్బాజ్, వైభవ్-నవీన్, శ్రేయస్-రషీద్ మధ్య జరిగే ఈ మూడు ఆసక్తికర సమరాలపైనే ఇప్పుడు అందరి చూపు నిలిచింది.
బుమ్రా వర్సెస్ గుర్బాజ్
భారత బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా ఉన్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు శుభారంభం లభించడం అత్యంత కీలకం. ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రహమానుల్లా గుర్బాజ్ మొదటి ఓవర్ నుంచే విరుచుకుపడే మనస్తత్వం ఉన్న ఆటగాడు. అయితే అతని వేగానికి అడ్డుకట్ట వేసేందుకు టీమిండియా మెయిన్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా సిద్ధంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇస్తున్న బూమ్రా నెట్స్ శిక్షణలో వైభవ్ సూర్యవంశీ వంటి యంగ్స్టర్లను తన బౌలింగ్తో తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. పవర్ ప్లేలోనే వికెట్ సాధించాలని బుమ్రా ప్రయత్నిస్తుంటే, అతడిని ఎదుర్కొని జట్టుకు భారీగా పరుగులు అందించాలని గుర్బాజ్ భావిస్తున్నాడు. ఈ పోరు మ్యాచ్ ఆరంభంలోనే పెద్ద మలుపు కానుంది.
వైభవ్ సూర్యవంశీ వర్సెస్ నవీన్-ఉల్-హక్
రెడ్ బాల్ ఫార్మాట్లో వరుసగా మూడు మ్యాచ్లు ఆడి వచ్చిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నేడు భారత్లో తన తొలి అంతర్జాతీయ టీ20 ఆడబోతున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారీ షాట్లు ఆడటానికి ఇష్టపడే వైభవ్కు ఆఫ్ఘన్ అనుభవజ్ఞుడైన పేసర్ నవీన్-ఉల్-హక్ రూపంలో పెద్ద సవాలు ఎదురుకానుంది. ఐపీఎల్తో పాటు అంతర్జాతీయంగా 48 టీ20లలో 67 వికెట్లు తీసిన నవీన్కు భారత మైదానాలపై స్పష్టమైన అవగాహన ఉంది. అనుభవజ్ఞులైన బౌలర్లను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడే వైభవ్, నవీన్ స్లోవర్ బాల్స్ వ్యూహాలను ఏ విధంగా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది.
శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రషీద్ ఖాన్
టాప్ ఆర్డర్లో వైభవ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నందున ఆరంభంలోనే వికెట్లు పడితే ఇన్నింగ్స్ను నిలబెట్టే బాధ్యత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై పడుతుంది. ఇన్నింగ్స్ను నిర్మిస్తూ స్కోరు వేగాన్ని తగ్గకుండా చూసేందుకు శ్రేయస్ ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచ స్థాయి లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మిడిల్, డెత్ ఓవర్లలో బౌలింగ్కు రానున్నాడు. శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఓవర్లలో స్పిన్ను ఎదుర్కోవడంలో దిట్ట అయినప్పటికీ, రషీద్ ఖాన్ విసిరే గూగ్లీలను అంచనా వేయడం సులభం కాదు. ఈ ఇద్దరి మధ్య జరిగే వ్యూహాత్మక పోరే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో కీలకంగా మారనుంది.
ఢిల్లీ వాతావరణం ఎలా ఉందంటే ?
సాయంత్రం మొదలయ్యే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ కళ్లు మూసుకుని బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షం కురిసినప్పటికీ నేడు మ్యాచ్కి పెద్దగా అంతరాయం కలిగే సూచనలు లేవు. చిన్న బౌండరీలు ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆటగాళ్ల మధ్య జరిగే ఈ 3 ముఖాముఖి పోరాటాలు ప్రేక్షకులకు మైమరిపించే వినోదాన్ని అందిస్తాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
