
IND A vs SL A Final : భారత యువ క్రికెటర్లతో కూడిన ఇండియా ఏ జట్టు మరో ప్రతిష్టాత్మక ఫైనల్ పోరుకు సిద్ధమైంది. శ్రీలంకలోని దంబూలా మైదానంలో నేడు ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకే ప్రారంభమైంది. టాలెంటెడ్ ప్లేయర్ తిలక్ వర్మ కెప్టెన్సీలో టీమిండియా ఈ సిరీస్ లో అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్ కు దూసుకొచ్చింది. నేటి మ్యాచ్ లో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకోవాలని భారత యువ సింహాలు కసితో ఉన్నారు.
గత మ్యాచ్ గొడవలు – ఫైనల్ పై పెరిగిన కసి
ఈ రెండు జట్లు తలపడిన గత మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక సినిమాను తలపించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్ చివరకు సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోనే వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్ల మధ్య పెద్ద వాగ్వాదం, గొడవ జరిగింది. అంపైర్లు జోక్యం చేసుకుని సర్దిచెప్పాల్సి వచ్చింది. ఆ పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇరు జట్లు నేడు తలపడనుండటంతో మ్యాచ్ లో స్లెడ్జింగ్, హై వోల్టేజ్ డ్రామా ఖాయంగా కనిపిస్తోంది. నేటి మ్యాచ్ లో ఎవరైతే ఒత్తిడిని జయిస్తారో వారికే కప్పు దక్కుతుంది.
వైభవ్ సూర్యవంశీపైనే భారీ ఆశలు
ఈ ఫైనల్ మ్యాచ్ లో అందరి కళ్లు మన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్.. ఈ ట్రై సిరీస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు, అత్యధిక స్కోరు 44 పరుగులు మాత్రమే. ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. అయితే, ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్ లో వైభవ్ తన పాత ఫామ్ అందుకుని లంక బౌలింగ్ అటాక్ ను ముక్కలు ముక్కలు చేస్తాడని మేనేజ్మెంట్ గట్టి నమ్మకంతో ఉంది.
సూర్యాంశ్ షెడ్గే సంచలనం
భారత జట్టులో ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాడు సూర్యాంశ్ షెడ్గే. నంబర్-7 లాంటి లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్కు వస్తున్నప్పటికీ ఆయన అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. ఈ టోర్నీలో 4 మ్యాచ్ల్లో 125 స్ట్రైక్ రేట్తో 145 పరుగులు చేశాడు. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు షెడ్గే 72 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. నేటి ఫైనల్లో కూడా ఫినిషర్ రోల్ లో షెడ్గే భారత్కు కొండంత అండగా నిలవనున్నాడు.
భారత బ్యాటర్లకు లంక స్పిన్నర్ విజయకాంత్ సవాల్
మరోవైపు శ్రీలంక జట్టులో భారత్ను భయపెడుతున్న బౌలర్ విజయకాంత్ వియాస్కాంత్. ఈ టోర్నమెంట్లో ఆయన ఇప్పటివరకు 6 వికెట్లు పడగొట్టి లంక టీమ్లోనే టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. ముఖ్యంగా భారత్తో జరిగిన గత మ్యాచ్ లో కేవలం 10 ఓవర్లు వేసి 26 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. భారత మిడిల్ ఆర్డర్ను దెబ్బతీయడంలో వియాస్కాంత్ దిట్ట. కాబట్టి నేటి మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఈ మిస్టరీ స్పిన్నర్ ను ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..