IPL రద్దు అయితే BCCIకి ఎన్ని కోట్లు నష్టం..? ప్లేయర్లకు పూర్తి ఫీజు చెల్లిస్తారా లేదా?
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిర్వహణపై బీసీసీఐ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. క్రికెటర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోబోతోంది. ఐపీఎల్ రద్దు అయితే బీసీసీఐకి భారీ నష్టం, ఆటగాళ్లకు చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

ఐపీఎల్ 2025 నిర్వాహణపై శుక్రవారం బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్ని, ఇరు దేశాలపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న తరుణంలో క్రికెటర్ల భద్రత గురించి ఆలోచిస్తూ.. ఐపీఎల్పై నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. పైగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను మధ్యలోనే నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మ్యాచ్ లక్నోలో జరగనుంది. ఒక వేళ భారత్, పాక్ ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ కనుక రద్దు చేస్తే.. బీసీసీఐకి ఎన్ని కోట్లు నష్టం వస్తుంది? ఇప్పటి వరకు ఆడిన ఆటగాళ్లకు మెగా వేలంలో పలికిన ధర మొత్తం చెల్లిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
మరి వీటికి సంబంధించి ఐపీఎల్ రూల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.. ముందుగా బీసీసీఐకి వాటిల్లే నష్టం గురించి మాట్లాడితే.. ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోతే కచ్చితంగా బీసీసీఐకి వేల కోట్లలో నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా బ్రాండ్ ప్రమోషన్, బ్రాడ్ కాస్టింగ్ సంస్థలకు బీసీసీఐ తిరిగి నగదు చెల్లించే అవకాశం ఉంది. పూర్తి సీజన్ కోసం వాళ్లు బీసీసీఐ డబ్బు చెల్లించి ఉంటారు. ఇప్పుడు టోర్నీ మధ్యలో ఆగితే వాళ్లు బీసీసీఐ నుంచి కచ్చితంగా రిఫండ్ అయితే అడుగుతారు. ఇక ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు ఫీజు చెల్లింపు గురించి మాట్లాడుకుంటే.. ఏ కారణం చేతనైనా ఐపీఎల్ రద్దు అయితే ఆటగాళ్లకు పూర్తి చెల్లించాలని ఎలాంటి నిబంధన లేదు.
ఈ విషయంలో ఆటగాళ్లతో ఆయా ఫ్రాంచైజీలు చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవచ్చు. ఏ ప్లేయర్కు ఎంత ధర చెల్లించాలి, ఎన్ని మ్యాచ్లు పూర్తి అయ్యాయి. ఎన్ని మిగిలి ఉన్నాయి.. ఇలా అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత ఆయా ఫ్రాంచైజీలైతే ఆటగాళ్లకు ఫీజు చెల్లిస్తాయి. అయితే వేలంలో పలికిన మొత్తం ధర అయితే ఇవ్వాల్సిందే అనే రూల్ అయితే కాంట్రాక్ట్లో లేదని సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ నుంచి కూడా ఎలాంటి స్పష్టత లేదు. గతంలో ఎప్పుడూ ఐపీఎల్ రద్దు కాలేదు కాబట్టి ఈ సమస్య రాలేదు. అయితే.. ఐపీఎల్ నిర్వాహించాలా? రద్దు చేయాలా? అనేది బీసీసీఐ డిసైడ్ చేసిన తర్వాత ఆటగాళ్ల ఫీజు చెల్లింపులపై కూడా ఓ నిర్ణయం తీసుకొని మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..