
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలోకి అడుగుపెట్టడమే ఆలస్యం.. తనదైన శైలిలో రికార్డుల మోత మోగించాడు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న హార్దిక్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ద్వారా రీఎంట్రీ ఇచ్చి బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డులో హార్దిక్ చోటు సంపాదించాడు.
టి20 క్రికెట్ చరిత్రలో ‘సెంచరీ లేకుండానే 300కు పైగా సిక్సర్లు’ బాదిన భారతీయ క్రికెటర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా చేరాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ క్రికెటర్ ఎంఎస్ ధోని మాత్రమే. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఆ జాబితాలో చేరిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
ఎంఎస్ ధోని: ఇప్పటివరకు టీ20లలో 300కు పైగా సిక్సర్లు కొట్టిన ధోని అత్యధిక వ్యక్తిగత స్కోరు 84 పరుగులు మాత్రమే (సెంచరీ లేదు).
హార్దిక్ పాండ్యా: తాజాగా బరోడా తరపున పంజాబ్పై ఆడిన ఇన్నింగ్స్లో 4 సిక్సర్లు బాదడం ద్వారా హార్దిక్ తన టి20 కెరీర్లో 300 సిక్సర్ల మైలురాయిని దాటాడు. హార్దిక్ టీ20 అత్యధిక స్కోరు కూడా సెంచరీ కంటే తక్కువే కావడం విశేషం.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టు తరపున బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా, పంజాబ్ జట్టుపై తన ప్రతాపం చూపించాడు. కేవలం 42 బంతుల్లోనే అజేయంగా 77 పరుగులు (నాటౌట్) సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా బరోడా జట్టు 223 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్కు ముందు హార్దిక్ పాండ్యా ఇలాంటి ఫామ్లో ఉండటం భారత జట్టుకు శుభపరిణామం. బౌలింగ్లో కాస్త తడబడినప్పటికీ, బ్యాటింగ్లో ఫినిషర్గా తన సత్తాను మరోసారి చాటాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..