AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: మీరు మారిపోయారు సార్.! 3 బంతుల్లోనే ముప్పుతిప్పలు.. కట్ చేస్తే.. మ్యాచ్ విన్నర్‌ అయ్యాడు

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ను 7 వికెట్ల తేడాతో గోవా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 170 పరుగులు చేయగా.. గోవా 18.3 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా రాణించాడు. ఆ వివరాలు..

Cricket: మీరు మారిపోయారు సార్.! 3 బంతుల్లోనే ముప్పుతిప్పలు.. కట్ చేస్తే.. మ్యాచ్ విన్నర్‌ అయ్యాడు
Arjun Tendulkar
Ravi Kiran
|

Updated on: Dec 03, 2025 | 8:19 AM

Share

సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో గోవాకు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఎడమచేతి వాటం బౌలర్ మధ్యప్రదేశ్‌పై మూడు వికెట్లు పడగొట్టాడు. పవర్‌ప్లేలో అతడి పదునైన బౌలింగ్ కారణంగా ప్రత్యర్ధి జట్టు భారీ స్కోర్ చేయడంలో ఇబ్బంది పడింది. ఈ విజయం ద్వారా గోవాకు ఈ సీజన్‌లో ఇది రెండో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 170 పరుగులు చేసింది. లక్ష్యాన్ని చేధించే క్రమంలో గోవా 18.3 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ సుయాష్ ప్రభుదేశాయ్ అజేయంగా 75 పరుగులు చేయగా, అభినవ్ తేజ్రానా 55 పరుగులతో రాణించాడు. వీరితో పాటు, అర్జున్ టెండూల్కర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గోవా తరఫున అర్జున్ టెండూల్కర్ ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబరిచి 3 వికెట్లు పడగొట్టాడు.

అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన ప్రదర్శన..

గోవా తరఫున అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఓపెన్ చేశాడు. తొలి ఓవర్ ఐదో బంతికి శివాంగ్ కుమార్‌ను అవుట్ చేశాడు. శివాంగ్ తన ఖాతా తెరవలేకపోయాడు. ఆ తర్వాతి ఓవర్‌లో అంకుష్ సింగ్‌ను అవుట్ చేసి ప్రత్యర్ధికి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. డెత్ ఓవర్లలో టెండూల్కర్ కాసిన్ని ఎక్కువ పరుగులు సమర్పించినప్పటికీ.. మూడో వికెట్ కింద 6 పరుగులకు వెంకటేష్ అయ్యర్‌ను అవుట్ చేశాడు. మధ్యప్రదేశ్ తరఫున హర్‌ప్రీత్ సింగ్ అజేయంగా 80 పరుగులు చేశాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇన్నింగ్స్ చివర్లో, అంకిత్ వర్మ నాలుగు సిక్సర్లతో 34 పరుగులు చేశాడు.

ఓపెనింగ్‌లో అర్జున్..

బౌలింగ్‌ ఓపెన్ చేయడమే కాదు.. బ్యాటింగ్‌లోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు అర్జున్ టెండూల్కర్. వరుసగా మూడు ఫోర్లు కొట్టి తిరుపరేష్ సింగ్ బౌలింగ్‌లో 16 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గోవాను అభినవ్ తల్రేజా, సుయేద్ ప్రభుదేశాయ్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ 66 బంతుల్లో 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లలిత్ యాదవ్ కూడా ప్రభుదేశాయ్‌తో కలిసి కేవలం 27 బంతుల్లో 57 పరుగులు జోడించి జట్టు విజయానికి తోడ్పడ్డాడు.