Virat Kohli Retirement: కోహ్లీ రిటైర్మెంట్‌ వెనుక కారణాలు ఇవేనా? అంతా అతనే చేశాడంటున్న అభిమానులు!

విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు అనూహ్యంగా ముగింపు పలికాడు. అభిమానులను నిరాశపరిచే ఈ నిర్ణయం వెనుక అనేక అంశాలు ఉన్నాయి. గౌతమ్ గాంభీర్ కోచింగ్ తో జట్టులోని మార్పులు, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలనే ఆలోచనలు కూడా దీనికి కారణాలు కావచ్చు. కోహ్లీ యొక్క ఫిట్‌నెస్, ఫామ్ ఇప్పటికీ అద్భుతంగా ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Virat Kohli Retirement: కోహ్లీ రిటైర్మెంట్‌ వెనుక కారణాలు ఇవేనా? అంతా అతనే చేశాడంటున్న అభిమానులు!
Gambhir Rohit And Kohli

Updated on: May 12, 2025 | 1:07 PM

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి క్రికెట్‌ లోకానికి ఊహించని షాక్‌ ఇచ్చాడు. 14 ఏళ్ల పాటు టెస్టు క్రికెట్‌ ఆడటం గర్వంగా ఉందని చెబుతూ.. సల్లాగా ఒక సోషల్‌ మీడియా పోస్ట్‌తో అభిమానులను శోకసంద్రంలో ముంచేశాడు. ఇప్పటికీ ఇండియన్‌ టీమ్‌లో ఫిట్‌నెస్‌ విషయంలో నంబర్‌ వన్‌గా ఉన్న కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్‌ ఇచ్చాడా అని క్రికెట్‌ అభిమానులు బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితమే కోహ్లీ రిటైర్మెంట్‌పై లీకులు వచ్చాయి. నేను రిటైర్ అవుతాను అని కోహ్లీ బీసీసీఐకి చెప్పినట్లు, అందుకు బీసీసీఐ లేదు లేదు మరోసారి ఆలోచించు.. నువ్వు టీమ్‌లో ఉండాలని చెప్పినట్లు వార్తలు గుప్పమన్నాయి. అవి నిజం కావొద్దని కోహ్లీ ఫ్యాన్స్‌ అంతా ప్రార్థనలు చేశారు. కానీ, చివరికి అదే నిజమైంది. విరాట్‌ కోహ్లీ టెస్ట్‌లుకు రిటైర్మెంట్‌ ప్రకటించేశాడు.

ఈజీగా ఇంకో నాలుగైదేళ్లు ఆడతాడని అనుకుంటూ ఇలా ఉన్నపళంగా గుడ్‌బై చెప్పేశాడు. నిజంగానే కోహ్లీ తానే స్వయంగా నిర్ణయం తీసుకున్నాడా? లేదా దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో క్రికెట్‌ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గౌతమ్‌ గంభీర్‌ వచ్చిన తర్వాత టీమ్‌ అంతా అతలాకుతలం అవుతుందని చాలా మంది ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. నిజానికి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఒక్కటి కాకుండా కోచ్‌గా గంభీర్‌ ట్రాక్‌ రికార్డ్‌ ఏమంతా గొప్పగా లేదు. బీజీటీ 2024-25లో దారుణ ఓటమి, న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టుల్లో క్వీన్‌ స్వీప్‌, శ్రీలంకలో వన్డే సిరీస్‌ ఓటమి ఇలా ఫేలవంగా సాగింది. కానీ, ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవగానే.. గంభీర్‌లో గర్వం, జట్టు శాసించే తత్వం బాగా పెరిగిపోయిందని క్రికెట్‌ అభిమానుల అంటున్నారు. అందుకు కారణం.. మొన్న రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌, ఇప్పుడు విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత వీరిద్దరితో పాటు జడేజా కూడా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు.

యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని, అలాగే టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన మంచి సందర్భం చూసి వాళ్లు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఇన్‌ ఫ్యాక్ట్‌ కోహ్లీ ఇప్పటికీ టీ20ల్లోనూ అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌ 2025లో అప్పుడే 500 ప్లస్‌ రన్స్‌ కొట్టేశాడు. చిన్న గ్రౌండ్‌లో ఏకంగా నాలుగు రన్స్‌ ఉరికాడు.. ఫిట్‌నెస్‌ ఇంకా ఫామ్‌ విషయంలో యువ క్రికెటర్ల కంటే బెటర్గా ఉన్నాడు. సరే టీ20 క్రికెట్‌ పోతే పోయింది.. టెస్టులు, వన్డేలు అన్న రోహిత్‌, కోహ్లీ ఆడతారు కదా అనుకున్నారు ఫ్యాన్స్‌. పైగా రోహిత్‌ నాలో ఇంకా చాలా క్రికెట్‌ మిగిలి ఉంది, కెప్టెన్సీ చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను, ఇంగ్లండ్‌తో రాణిస్తాను అని ప్రకటించిన కొన్ని రోజులకే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కనీసం ఇంకో నాలుగేళ్లు ఆడతాడు అని అనుకున్న కోహ్లీ కూడా ఇప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కొన్ని రోజుల క్రితం వీళ్లు చెప్పిందేంటి.. ఇప్పుడు జరుగుతుందేంటి..? కచ్చితంగా రోహిత్‌, కోహ్లీ రిటైర్మెంట్‌ వెనుక కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి