
Vaibhav Sooryavanshi : భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ తన అగ్రెసివ్ బ్యాటింగ్తో ఈ వండర్ కిడ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. లీగ్లో పరుగుల వరద పారించడమే కాకుండా.. ఎంతటి దిగ్గజ బౌలర్లనైనా ఎదుర్కొని సత్తా చాటాడు. అతని అసాధారణ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.. త్వరలో జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం భారత టీ20 జట్టులోకి వైభవ్ను ఎంపిక చేసింది. టీమిండియాకు సెలెక్ట్ అయిన కొద్దిరోజులకే వైభవ్ సూర్యవంశీ టెస్ట్ క్రికెట్పై తనకున్న ఇష్టాన్ని, లక్ష్యాలను బయటపెట్టాడు. రాజస్థాన్ రాయల్స్ అధికారిక సోషల్ మీడియా ఛానెల్లో టీమ్ మేనేజర్ రోమీ భిందర్తో మాట్లాడిన వైభవ్.. టెస్ట్ మ్యాచ్లు ఆడటంపై నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చాడు. తాను కేవలం టీ20 ఫార్మాట్కే పరిమితం కానని, రెడ్ బాల్ క్రికెట్ ఆడటమే తన పరమావధి అని స్పష్టం చేశాడు.
రెడ్ బాల్తో భారీగా ప్రాక్టీస్ చేశా
ఈ సందర్భంగా వైభవ్ మాట్లాడుతూ.. ‘చాలా మంది నన్ను భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్ ఆడతావా అని అడుగుతున్నారు. నా సమాధానం ఒక్కటే.. నేను ఇప్పటికే ఎరుపు రంగు బంతితో చాలా ప్రాక్టీస్ చేశాను, ముందు ముందు కూడా చేస్తూనే ఉంటాను. నా సొంత రాష్ట్రం బీహార్ తరఫున నేను ఇప్పటికే ఎన్నో రెడ్ బాల్ మ్యాచ్లు ఆడాను. కేవలం టీ20 ఆడుతున్నాను కదా అని నాకు టెస్ట్ ఫార్మాట్ రాదు అనుకుంటే పొరపాటే’ అని అన్నాడు.
పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ మారుస్తా
‘నాకు టీమిండియా తరఫున టెస్టులు ఆడటం అంటే చాలా ఇష్టం. దాని కోసమే కఠినంగా శ్రమిస్తున్నాను. టీ20 లో నా అగ్రెసివ్ స్ట్రైక్ రేట్ అనేది ఆ ఫార్మాట్ ఉన్న డిమాండ్ వల్ల వచ్చింది. అదే నేను టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు.. అక్కడి పిచ్ పరిస్థితులు, మ్యాచ్ అవసరాలకు తగినట్లుగా నా బ్యాటింగ్ శైలిని మార్చుకుంటాను. భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) ప్రాతినిధ్యం వహించడమే నా జీవిత ఆశయం. మిగతాదంతా దేవుడి చేతుల్లో ఉంది’ అని వైభవ్ ఎంతో పరిణతితో సమాధానమిచ్చాడు.
12 ఏళ్లకే రంజీల్లో రికార్డు హిస్టరీ
వైభవ్ చిన్న వయసులోనే టీం ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో అతని క్రికెట్ కెరీర్ చాలా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. కేవలం 15 ఏళ్లకే టీ20 జట్టు తలుపు తట్టిన ఈ కుర్రాడు.. భవిష్యత్తులో వన్డే, టెస్టుల్లో కూడా ఖాయంగా అడుగుపెడతాడని మాజీలు అంచనా వేస్తున్నారు. నిజానికి వైభవ్కు రికార్డులు సృష్టించడం ఇదేం కొత్త కాదు. కేవలం 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరఫున రంజీ ట్రోఫీ బరిలోకి దిగి.. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో రంజీ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లలో ఒకడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి