Virat Kohli : 2027 ప్రపంచ కప్ వరకు ఢోకా లేదు.. విరాట్ కోహ్లీకి ఫుల్ సపోర్ట్ ప్రకటించిన బ్యాటింగ్ కోచ్!

భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా కోహ్లీ భవిష్యత్తు గురించి వస్తున్న ఊహాగానాలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు.

Virat Kohli :  2027 ప్రపంచ కప్ వరకు ఢోకా లేదు.. విరాట్ కోహ్లీకి ఫుల్ సపోర్ట్ ప్రకటించిన బ్యాటింగ్ కోచ్!
Virat Kohli

Updated on: Dec 01, 2025 | 4:30 PM

Virat Kohli :భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా కోహ్లీ భవిష్యత్తు గురించి వస్తున్న ఊహాగానాలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. కోహ్లీ ఫామ్, ఫిట్‌నెస్ ప్రపంచ స్థాయిలోనే ఉన్నాయని, అందుకే 2027 ఐసీసీ ప్రపంచ కప్ వరకు అతని స్థానం ప్రశ్నార్థకం కాదని కోటక్ స్పష్టం చేశారు. అయితే కోహ్లీ-రోహిత్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బీసీసీఐ అత్యవసర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.

రాంచీలో జరిగిన మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ 135 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ప్రదర్శన తర్వాత కోటక్ అతన్ని కొనియాడారు. “ఇది నిస్సందేహంగా అద్భుతమైన ఇన్నింగ్స్. కోహ్లీ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అతను పూర్తిగా అసాధారణమైన ఆటగాడు, బాధ్యత తీసుకుని అతను ఆడిన విధానం చాలా బాగుంది” అని కోటక్ అన్నారు.

కోహ్లీ టెస్ట్, 20ల నుంచి రిటైర్ అయిన తర్వాత అతని భవిష్యత్తుపై వస్తున్న చర్చలను కోటక్ తోసిపుచ్చారు. కోహ్లీ తన ఫామ్, ఫిట్‌నెస్‌తో యువ ఆటగాళ్లు కలలు కనే స్థాయిలో ఇంకా ప్రదర్శన ఇస్తున్నప్పుడు, అతని భవిష్యత్తు గురించి చర్చించాల్సిన అవసరం లేదని కోటక్ స్పష్టం చేశారు. “అతని ఫిట్‌నెస్ చూస్తే, అతని గురించి ఏ ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు” అని కోచ్ బలంగా నొక్కి చెప్పారు.

మ్యాచ్ సమయంలో కోహ్లీ వెన్ను సమస్యతో ఫిజియోల వద్ద చికిత్స తీసుకున్న విషయంపై.. “నాకు తెలిసినంతవరకు అతని వీపు బాగానే ఉంది. అతను పర్వాలేదు” అని కోటక్ తెలిపారు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మపై వస్తున్న విమర్శలను కూడా కోటక్ కొట్టిపారేశారు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ప్రాక్టీస్ సమయంలో యువ ఆటగాళ్లకు తమ అనుభవంతో వారికి మార్గనిర్దేశం చేస్తున్నారని కోచ్ పేర్కొన్నారు. జట్టుకు అవసరమైనప్పుడు వారు బలమైన ప్రదర్శన ఇస్తున్నారని వివరించారు.

రెండో వన్డేకు ముందు, జట్టు నిర్వహణ, సీనియర్ ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి బీసీసీఐ ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ముఖ్యమైన సమావేశం డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో జరగనుంది. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా.. సంయుక్త కార్యదర్శి ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు, ప్రస్తుత టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్‌ను తగ్గించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యం. సెలెక్టర్లు, జట్టు నిర్వహణ పూర్తిగా ఏకీభవించేలా చూడటం, ఆటగాళ్ల కోసం మెరుగైన అభివృద్ధి ప్రణాళికలు, మొత్తం జట్టు పనితీరును మెరుగుపరచడం బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us