
Shreyas Iyer Furious: ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్ను ఘోరంగా నష్టపోవడంపై భారత జట్టు తాత్కాలిక సారథి శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. వరుస ఓటములతో అభిమానుల గుండెల్లో నిండిన నిరాశను తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్న ఆయన, నాల్గో టీ20 ముగిసిన అనంతరం జట్టు పరాజయానికి దారితీసిన ప్రధాన లోపాలను విలేకరుల సమావేశంలో బహిరంగంగా పంచుకున్నారు.
నాలుగో పోరాటంలో ఒకవైపు వికెట్లు పడుతున్నా శ్రేయస్ అయ్యర్ 80 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఒంటరి పోరాటం చేశారు. అయితే, మిగిలిన బ్యాటర్ల నుంచి కనీస సహకారం లభించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఒక కెప్టెన్గా నేను నా బాధ్యతను నిర్వర్తించాను, కానీ క్రికెట్ అనేది 11 మంది కలిసి ఆడే ఆట. కేవలం ఒక్కరి ప్రదర్శనతో మ్యాచ్లు గెలవడం సాధ్యం కాదు. పవర్ప్లే ఓవర్లలోనే వరుసగా కీలక వికెట్లు కోల్పోవడం వల్ల మ్యాచ్పై పట్టు కోల్పోయాం. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ, మన బ్యాటర్లు భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు” అని అయ్యర్ వాపోయారు.
జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆటగాళ్ల వైఫల్యాలను కూడా శ్రేయస్ అయ్యర్ వేలెత్తి చూపారు. అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని తట్టుకోవడంలో యువకులు ఇంకా రాటుదేలాల్సి ఉందన్నారు. ముఖ్యంగా భాగస్వామ్యాలు (పార్టనర్షిప్లు) నెలకొల్పడంలో విఫలమవడం, కనీసం ఒకట్రెండు పరుగులు తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయలేకపోవడం జట్టు స్కోరును దెబ్బతీసిందని బోర్డు ముందుంచిన విమర్శలను ఆయన సమర్థించారు. ప్రతిభ ఉన్నప్పటికీ ఆ ప్రతిభను మైదానంలో పరుగుల రూపంలోకి మార్చడంలో యువ బ్యాటర్లు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ చెత్త ఫాం కంటిన్యూ చేస్తున్నాడు. కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరి హ్యాండిచ్చాడు. అసలు ఈ ఆల్ రౌండర్ను ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయ్యర్ కామెంట్స్ కూడా సుందర్ స్థానంపైనేనని చర్చ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: 0-3తో ఘోర పరాభవం.. ప్రపంచ క్రికెట్లోనే చెత్త ప్లేయింగ్ 11 అంటూ ఫ్యాన్స్ ఫైర్..
కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ విభాగం కూడా ఈ సిరీస్ ఓటమికి ప్రధాన కారణమని అయ్యర్ స్పష్టం చేశారు. “159 పరుగుల లక్ష్యం చిన్నదే అయినప్పటికీ, కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టవచ్చు. కానీ మన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రణాళికలను మైదానంలో సరిగ్గా అమలు చేయలేకపోయాం. ప్రత్యర్థి బ్యాటర్లు ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్లు ఆడుతుంటే మన బౌలింగ్ విభాగం పూర్తిగా లొంగిపోయింది” అని విమర్శించారు. ముఖ్యంగా స్పిన్ బౌలర్లు మధ్య ఓవర్లలో పరుగులను నియంత్రించలేకపోవడం ఇంగ్లండ్ విజయానికి మార్గం సుగుమం చేసిందని ఒప్పుకున్నారు.
ఈ సిరీస్ ఓటమి తమ కళ్లు తెరిపించిందని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నారు. రాబోయే మ్యాచ్లలో జట్టు సమతుల్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, లోపాలను సరిదిద్దుకుని బలంగా పునరాగమనం చేస్తామని అభిమానులకు హామీ ఇచ్చారు. సీనియర్లు, జూనియర్ల కలయికతో జట్టును మళ్లీ విజయాల బాట పట్టిస్తామని కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..