IND vs ENG: శుబ్‌మన్‌ గిల్‌ దెబ్బకు మా సరదా తీరిపోయింది..! మ్యాచ్‌ తర్వాత బెన్‌ స్టోక్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇంగ్లాండ్‌పై 336 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ అద్భుతమైన 430 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ విజయం తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టీమిండియాను ప్రశంసించాడు.

IND vs ENG: శుబ్‌మన్‌ గిల్‌ దెబ్బకు మా సరదా తీరిపోయింది..! మ్యాచ్‌ తర్వాత బెన్‌ స్టోక్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Gill And Ben Stokes

Updated on: Jul 06, 2025 | 11:56 PM

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జూలై 2న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా మొదలైన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా అద్భుత విజయం సాధించింది. 336 పరుగుల అతి భారీ తేడాతో ఈ గెలుపు అందుకుంది. తొలి టెస్టులో టీమిండియాపై గెలిచిన ఇంగ్లాండ్‌, రెండో టెస్టులో మాత్రం టీమిండియా ముందు తొలంచింది. ఈ ఓటమి తర్వాత ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఒక క్లాస్‌ టీమ్‌ అని, వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్లతో కూడిన జట్టుతో ఆడుతున్నప్పుడు ఇలాంటివి సహజమే అన్నాడు.

ముఖ్యంగా టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ గురించి మాట్లాడుతూ.. గిల్‌ చాలా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని, అంత సేపు అతను క్రీజ్‌లో పాతుకుపోయి ఆడటంతో మేం శారీరకంగా, మానసికంగా కూడా అలసిపోయామంటూ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సులతో 269 పరుగులు సాధించాడు. గంటల తరబడి క్రీజ్‌లో పాతుకుపోయి బ్యాటింగ్‌ చేసి.. ఇంగ్లాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలా అని రెండో ఇన్నింగ్స్‌లో వదిలిపెట్టాడా అంటే అదీ లేదు. రెండో ఇన్నింగ్స్‌లో 162 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సులతో 161 పరుగులు చేసి మళ్లీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇలా గిల్‌ అంత సేపు ఆడటంతో తమ బౌలర్లు కూడా బాగా అలసిపోయారని, ఇక తమకు పూర్తిగా రెస్ట్‌ కావాలంటూ బెన్‌ స్టోక్స్‌ తమను గిల్‌ ఎంతలా వేధించాడో వివరించాడు. అలాగే ఇక తాము లార్డ్స్‌లో జరగబోయే మూడో టెస్టు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత బ్యాటింగ్‌ చేసిన గిల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి గిల్‌ 430 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసి రెండో బ్యాటర్‌గా గిల్‌ నిలిచాడు. అలాగే 58 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా తొలి టెస్టు విజయం సాధించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి