ఐపీఎల్(IPL) అభిమానులను ఉర్రూతలూగించే వార్త ఇది. దాదాపు రెండు నెలలు ఉండే లీగ్.. వచ్చే ఏడాది నుంచి 75 రోజులు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు బీసీసీఐ చర్యలను వేగవంతం చేసింది. కొత్త ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసే ఉద్దేశ్యం తమకు లేదని, గతేడాది నుంచి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రెండు జట్లతో కలుపుకుని మొత్తం పది జట్లతో మ్యాచ్ లు నిర్వహిస్తామని బీసీసీఐ (BCCI) కార్యదర్శి జై షా వెల్లడించాడు. ఈ మేరకు ఐసీసీతోపాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. టాప్ క్లాస్ ఆటగాళ్లందరూ లీగ్ మ్యాచ్ కు అందుబాటులో ఉండేలా చూసుకుంటామన్నారు. ఇందుకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తామని వెల్లడించారు. కాగా.. రెండున్నర నెలలపాటు ఐపీఎల్ నిర్వహిస్తే మ్యాచ్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ భారీ మొత్తం దక్కించుకొంది. ఈ క్రమంలో టాప్ జట్లతో ద్వైపాక్షిక సిరీస్లను ఆడేలా సమగ్రమైన క్యాలెండర్ను రూపొందించడమే తమ లక్ష్యమని జై షా (Jai Shah) స్పష్టం చేశారు.
ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని ఐసీసీతోపాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్నాం. వచ్చే ఏడాది టీ20 లీగ్ను రెండున్నర నెలలపాటు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నాం. ఈ మేరకు ఐసీసీ క్యాలెండర్లోనూ అవకాశం కల్పిస్తాం. టాప్ ఆటగాళ్లు తప్పకుండా హాజరవుతారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.
– జై షా , బీసీసీఐ కార్యదర్శి
కాగా.. ఐపీఎల్ 15వ సీజన్లో గుజరాత్ టైటాన్స్జట్టు విజేతగానిలిచింది. లీగ్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే ఫైనల్చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన గుజరాత్.. అదే ఊపులో కప్పు కొట్టేసింది. ఆరంభ సీజన్లో టైటిల్ గెలిచాక ఇంత కాలానికి మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టిన రాజస్థాన్కు నిరాశ ఎదురైంది. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్తో జరిగిన తుది సమరంలో ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించి టైటిల్ని ముద్దాడింది.