అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం.. భారత ఆటగాళ్లకు ఎన్ని కోట్లు ఇవ్వనుందంటే?

శుక్రవారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి ట్రోఫీ గెలిచిన టీమిండియాకు భారత నియంత్రణ మండలి (BCCI) రూ.7.50 కోట్ల బహుమతిని ప్రకటించింది. 2026 అండర్-19 ప్రపంచ కప్‌ను గెలిచినందుకు, అజేయంగా నిలిచి, ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించినందుకు భారత అండర్-19 జట్టు పట్ల బీసీసీఐ ప్రశంసల జల్లుతో పాటు కాసుల వర్షం కురిపించింది.

అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం.. భారత ఆటగాళ్లకు ఎన్ని కోట్లు ఇవ్వనుందంటే?
U19 world cup

Updated on: Feb 07, 2026 | 12:30 PM

శుక్రవారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి ట్రోఫీ గెలిచిన టీమిండియాకు భారత నియంత్రణ మండలి (BCCI) రూ.7.50 కోట్ల బహుమతిని ప్రకటించింది. 2026 అండర్-19 ప్రపంచ కప్‌ను గెలిచినందుకు, అజేయంగా నిలిచి, ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించినందుకు భారత అండర్-19 జట్టు పట్ల బీసీసీఐ ప్రశంసల జల్లుతో పాటు కాసుల వర్షం కురిపించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఏఎన్ఐతో మాట్లాడుతూ, “అండర్-19 ప్రపంచ కప్ 2026 విజయంలో మన అండర్-19 జట్టు పట్ల మొత్తం దేశంతోపాటు బీసీసీఐ గర్వంగా ఉంది. ఫైనల్స్‌లో మన జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించిన విధానం, టోర్నమెంట్‌ను శాసించిన విధానం బాగుంది. బీసీసీఐ ఈ అండర్ 19 జట్టుకు రూ.7.50 కోట్ల నగదు బహుమతిని అందజేస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ యంగ్ భారత జట్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. “భారతదేశ క్రికెట్ ప్రతిభ ప్రకాశిస్తుంది! ప్రపంచ కప్‌ను ఇంటికి తీసుకువచ్చినందుకు మా అండర్-19 జట్టు పట్ల గర్వంగా ఉంది. టోర్నమెంట్ అంతటా జట్టు చాలా బాగా ఆడింది, అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ విజయం అనేక మంది యువ క్రీడాకారులకు కూడా స్ఫూర్తినిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.

జింబాబ్వేలోని హరారేలో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026ను గెలుచుకుని, ఫైనల్‌లో ఇంగ్లాండ్ U19ను 100 పరుగుల తేడాతో ఓడించి, ఆరోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది భారత జట్టు. ఈక్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 51 బంతుల్లో 53 పరుగులు జోడించగా, అభిజ్ఞాన్ కుందు 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాడు కాలేబ్ ఫాల్కనర్ 115 పరుగులతో చివరకు పోరాడిన ఫలితం దక్కలేదు.

యూత్ వన్డే ఫైనల్లో భారత జట్టు 31 సిక్సర్లు కొట్టింది. ఇది మునుపటి 23 సిక్సర్ల రికార్డు కంటే చాలా ఎక్కువగా ఉంది. అంతకుముందు 2000, 2008, 2012, 2018, 2022లో భారత జట్టు అండర్-19 ప్రపంచ కప్ విజయాలకు చవిచూడగా.. ఇంగ్లాండ్ 1998 తర్వాత ఇంకా రెండో టైటిల్‌ను గెలుచుకోలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..