Abhishek Sharma : ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..పాక్ వేటకై వస్తున్న పంజాబ్ సింహం..ఇక దాయాదికి చుక్కలే
Abhishek Sharma : పాకిస్థాన్తో జరగబోయే కీలక సమరానికి ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన, ప్రస్తుతం జట్టుతో కలిసి కొలంబోలో ప్రాక్టీస్కు సిద్ధమవుతున్నారు.

Abhishek Sharma : పాకిస్థాన్తో జరగబోయే కీలక సమరానికి ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన, ప్రస్తుతం జట్టుతో కలిసి కొలంబోలో ప్రాక్టీస్కు సిద్ధమవుతున్నారు. నంబర్ 1 టీ20 బ్యాటర్గా ఉన్న అభిషేక్ రాకతో భారత బ్యాటింగ్ లైనప్కు మళ్లీ పూర్వవైభవం వచ్చినట్లయింది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ, ఆ తర్వాత తీవ్రమైన కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్ కారణంగా నమీబియాతో జరిగిన రెండో మ్యాచ్కు దూరమయ్యారు. పరిస్థితి విషమించడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అభిషేక్ కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పారు. కానీ, అద్భుతమైన రికవరీతో అభిషేక్ ఇప్పుడు మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు.
పంజాబ్ కింగ్స్ తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో పేసర్ అర్ష్దీప్ సింగ్ తన మిత్రుడు అభిషేక్ శర్మను ఎలా ఉన్నావు? అని పలకరించగా.. అభిషేక్ నవ్వుతూ దాల్-రైస్.. చాలా బాగున్నాను అని బదులిచ్చారు. దీనికి అర్ష్దీప్ స్పందిస్తూ.. త్వరగా దాల్-రైస్ తిని పూర్తిగా కోలుకో అని సరదాగా కామెంట్ చేశారు. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు మా ఓపెనర్ వచ్చేస్తున్నాడు.. ఇక పాక్ బౌలర్లకు పండగే అంటూ ఖుషీ అవుతున్నారు.
అభిషేక్ శర్మ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్-1 టీ20 బ్యాటర్గా కొనసాగుతున్నారు. 2024 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులోకి వచ్చిన ఈ యువ కెరటం, ఇప్పటివరకు 38 మ్యాచ్లలో 194.74 స్ట్రైక్ రేట్తో ఏకంగా 1,297 పరుగులు సాధించారు. ఇందులో రెండు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేవలం మూడు మ్యాచుల్లోనే పాకిస్థాన్పై 110 పరుగులు చేసిన ఘనత ఆయన సొంతం. పాక్పై ఆయనకున్న 189 స్ట్రైక్ రేట్ చూస్తుంటే, కొలంబోలో సిక్సర్ల వర్షం కురవడం ఖాయమనిపిస్తోంది.
ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ మధ్య హై-వోల్టేజ్ పోరు జరగనుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అభిషేక్ శర్మ, నేరుగా జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొనబోతున్నారు. ఓపెనర్గా అభిషేక్ వస్తే, జట్టుకు అదిరిపోయే ఆరంభం లభిస్తుందని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. మరి ఈ మిస్టరీ బ్యాటర్ పాక్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
