
Vaibhav Suryavanshi : సాధారణంగా 15 ఏళ్ల వయసులో ఏ పిల్లాడైనా స్కూల్కి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చి టీవీలో ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ భవిష్యత్తులో ఇండియాకు ఆడాలని కలలు కంటాడు. కానీ బీహార్కు చెందిన ఆ వండర్ కిడ్ మాత్రం కలలు కనడమే కాదు.. ఆ కలను చిన్న వయసులోనే నిజం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఐపీఎల్ లీగ్ను తన బ్యాటింగ్ పవర్తో వణకిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడుతున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ, ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త సంచలనంగా మారాడు.
సీజన్ ప్రారంభంలో ఈ చిన్నపిల్లాడు ఒకటో రెండో మ్యాచ్ల్లో ఆడినా, ఆ తర్వాత బౌలర్లు ఇతని బలహీనతలను కనిపెట్టి అవుట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పటివరకు 15 మ్యాచ్లు ముగిసినా ఒక్క బౌలర్ కూడా ఈ చిన్నోడిని కట్టడి చేయలేకపోయాడు. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ ఒంటిచేత్తో ఆరెంజ్ ఆర్మీని టోర్నమెంట్ నుంచే వెళ్లగొట్టాడు. ఈ మ్యాచ్లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒక చారిత్రాత్మక సిక్సర్ల రికార్డును వైభవ్ బద్దలు కొట్టడంతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఈ కుర్రాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన డూ ఆర్ డై మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 243/8 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ స్కోరులో ఏకంగా 97 పరుగులు కేవలం వైభవ్ సూర్యవంశీ ఒక్కడే చేశాడు. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ బౌలింగ్ అటాక్ను ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఆటాడుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 334 స్ట్రైక్ రేట్తో 97 పరుగులు రఫ్ఫాడించాడు. అతని ధాటికి రాజస్థాన్ కొండంత స్కోరు చేయగా.. అనంతరం బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్కు అర్హత సాధించి గుజరాత్ టైటాన్స్ (GT) తో తలపడటానికి సిద్ధమైంది.
ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ సింగిల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా క్రిస్ గేల్ పేరిట ఉన్న పాత రికార్డును వైభవ్ సూర్యవంశీ తిరగరాశాడు. జియో స్టార్ ఛానల్లో డిస్కషన్లో పాల్గొన్న సౌతాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్, వైభవ్ను ఆస్ట్రేలియా ఓపెనింగ్ లెజెండ్ మాథ్యూ హేడెన్తో పోల్చాడు. “15 ఏళ్ల వయసులోనే వైభవ్కు తన బ్యాటింగ్ ప్రిపరేషన్, ప్లానింగ్స్ పై ఉన్న క్లారిటీ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మ్యాచ్ కంటే ముందే బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో మైండ్ గేమ్ ఆడటం, విజువలైజ్ చేసుకోవడం చూస్తుంటే అతనికి చాలా మెచ్యూరిటీ ఉందని అర్థమవుతోంది. గతంలో మాథ్యూ హేడెన్ కూడా బ్యాటింగ్కు వచ్చే ముందు పిచ్పై కాసేపు ఒంటరిగా ఉంటూ ఇలాగే విజువలైజ్ చేసుకునేవాడు. వైభవ్ ఎవరినో కాపీ కొట్టకుండా తనకంటూ ఒక సొంత శైలిని అలవర్చుకోవడం చాలా గొప్ప విషయం. ప్రపంచంలోని బెస్ట్ ప్లేయర్లు తమకు ఏది సెట్ అవుతుందో ముందే గుర్తిస్తారు.. వైభవ్ కూడా అదే చేస్తున్నాడు” అంటూ డివిలియర్స్ కొనియాడాడు.
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న మాథ్యూ హేడెన్.. తన ఆట రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్గా పేరు తెచ్చుకున్నాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగడం, వాళ్లను అస్సలు సెట్ అవ్వనివ్వకపోవడమే అతని స్టైల్. అప్పట్లో బౌలర్లు హేడెన్ను చూసి భయపడేవారు. సరిగ్గా ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆటతీరు కూడా అలాగే ఉంది. అతను క్రీజులోకి వస్తే చాలు.. బౌలర్లకు ఎక్కడ బాల్ వేయాలో అర్థం కాక తెగ టెన్షన్ పడిపోతున్నారు. మ్యాచ్ను క్షణాల్లో మార్చేసే సత్తా ఈ ఇద్దరిలోనూ సమానంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ ఈ స్థాయికి చేరిందంటే దానికి కారణం వైభవ్ సూర్యవంశీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. జట్టులోని మిగతా సీనియర్ ఆటగాళ్లు స్థిరంగా రాణించలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో.. ఈ చిన్నోడు మాత్రం మ్యాచ్ మ్యాచ్కూ తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ఇతని రికార్డులు చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే:
మొత్తం ఆడిన మ్యాచ్లు: 15
చేసిన పరుగులు: 680
స్ట్రైక్ రేట్: 242.86
హాఫ్ సెంచరీలు (50s): 4
సెంచరీలు (100s): 1
ఇప్పటికే ఈ సీజన్లో అనేక రికార్డులను తిరగరాసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ సెన్సేషన్, గుజరాత్ టైటాన్స్తో జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో మరిన్ని రికార్డులు సృష్టించడానికి రెడీ అయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..