
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 వేదికగా సాగుతున్న ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన జైత్రయాత్రను ఘనంగా ప్రారంభించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాపై సాధించిన ఘనవిజయంతో టీమిండియా ఫామ్ను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ నేపథ్యంలో క్రికెట్ విశ్లేషకులు, మాజీ దిగ్గజాలు భారత్ విజయావకాశాలపై సంచలన అంచనాలు వేస్తున్నారు. దాదాపు 96 శాతం మంది నిపుణులు ఈసారి కూడా కప్పు భారత్దేనని గంటాపథంగా చెబుతున్నారు. జియోస్టార్ బ్రాడ్కాస్టర్లకు చెందిన 46 మంది క్రికెట్ నిపుణులు ఈ టోర్నీపై తమ అంచనాలను వెల్లడించారు. వీరిలో 96 శాతం మంది భారత్ కచ్చితంగా ఫైనల్ చేరుతుందని, టైటిల్ నెగ్గుతుందని జోస్యం చెప్పారు. 2007 వరల్డ్ కప్ హీరోలు ఇర్ఫాన్ పఠాన్, పీయూష్ చావ్లాతో పాటు అనిల్ కుంబ్లే, సబా కరీం, యుజ్వేంద్ర చాహల్ వంటి దిగ్గజాలు భారత్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. గత మూడు ఐసీసీ ఈవెంట్లలో (2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ) భారత్ ఫైనల్ చేరిన ట్రెండ్ను ఈసారి కూడా కొనసాగిస్తుందని వారు భావిస్తున్నారు.
ఫైనల్ లో తలపడేది ఎవరు?
ఈసారి ఫైనల్ మ్యాచ్ ఎవరి మధ్య జరుగుతుందనే దానిపై నిపుణుల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భారత్ vs ఆస్ట్రేలియా: సుమారు 35 శాతం మంది నిపుణులు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
భారత్ vs సౌత్ ఆఫ్రికా: 30 శాతం మంది నిపుణులు 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ రిపీట్ అవుతుందని, మళ్ళీ భారత్-సౌతాఫ్రికా తలపడతాయని భావిస్తున్నారు.
సెమీ ఫైనల్ రేసులో నిలిచే జట్లు
సునీల్ గవాస్కర్, ఆరోన్ ఫించ్, అలాన్ విల్కిన్స్ వంటి దిగ్గజాలు సెమీ ఫైనల్ చేరే జట్లపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్ తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు టాప్-4లో ఉండే అవకాశం ఉందని మెజారిటీ నిపుణులు చెబుతున్నారు. కొందరు అఫ్గానిస్తాన్, పాకిస్థాన్ జట్లకు కూడా స్వల్ప అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఎందుకు భారత్ కే విజయావకాశాలు?
న్యూజిలాండ్ మాజీ బౌలర్ డానీ మోరిసన్ విశ్లేషణ ప్రకారం.. “భారత్ సొంత గడ్డపై ఆడుతోంది. ఇక్కడి పరిస్థితులు, పిచ్లపై వారికి పూర్తి అవగాహన ఉంది. ఈ బ్లూ జెర్సీని ఆపడం ఎవరికైనా కష్టమే”. ఐపీఎల్ ఆడిన అనుభవం ఉండటం వల్ల విదేశీ ఆటగాళ్లు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, టీమిండియా బ్యాలెన్సుడుగా ఈసారి అద్భుతంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగబోయే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..