బర్మింగ్హామ్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్లో శుభారంభం చేశారు. తమ తమ విభాగాల్లో జరిగిన తొలి రౌండ్ పోరులో ఘన విజయాలు సాధించారు. ఈ మెగా టోర్నీ మాజీ ఫైనలిస్టు సైనా 21-17, 21-18 తేడాతో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)ను వరుస గేముల్లో ఓడించింది. తర్వాతి రౌండ్లో ఆమె డెన్మార్క్కు చెందిన లైన్ హొజ్మార్క్తో తలపడనుంది. ఫ్రాన్స్ ఆటగాడు బ్రైస్ లెవెర్డెజ్ 21-13, 21-11ను కిదాంబి శ్రీకాంత్ చిత్తు చేశాడు. రెండో రౌండ్లో అతడు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతక విజేత జొనాథన్ క్రిస్టీతో పోరాడనున్నాడు.
ఇంతకు ముందే రెండో రౌండ్కు చేరుకున్న బి.సాయి ప్రణీత్ హాంకాంగ్ ఆటగాడు లాంగ్ ఆంగుస్తో తలపడనున్నాడు. యువ కెరటం సమీర్ వర్మ పోరాడి ఓడాడు. మాజీ ప్రపంచ ఛాంపియన్, ప్రపంచ నంబర్వన్ అక్సెల్సెన్ చేతిలో 21-16, 18-21, 14-21 తేడాతో ఓటమి చవిచూశాడు. మహిళల డబుల్స్లో అశ్విని పొనప్ప, సిక్కిరెడ్డి జోడీ 21-16, 26-28, 16-21 తేడాతో జపాన్ ద్వయం సిహో టనక, కోహరు యోనెమోటోతో మ్యాచ్లో పోరాడి ఓడింది. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి, ప్రణవ్ చోప్రా 21-23, 17-21 తేడాతో ఓడిపోయారు. పురుషుల డబుల్స్లో మను అత్రి, సుమీత్ రెడ్డి ద్వయం 19-21, 21-16, 14-21 తేడాతో ఓటమి చవిచూశారు.