Andhra Pradesh: తాగుడు మాన్పించే దేవుడు.. మందుబాబులకు మాలధారణే విరుగుడా..?

| Edited By: Balaraju Goud

Oct 01, 2024 | 5:47 PM

మద్యం మాన్పించే దేవుడు.. అవును మీరు విన్నది నిజమే..! ఆ గుడికి ఒక్కసారి వెళ్తే.. తాగుడు మానేస్తారట..! నెలలో రెండు రోజులు ఆ దేవాలయానికి వేల సంఖ్యలో ఎక్కడెక్కడ నుంచో మందుబాబులు క్యూ కడతున్నారట.

Andhra Pradesh: తాగుడు మాన్పించే దేవుడు.. మందుబాబులకు మాలధారణే విరుగుడా..?
Pandu Ranga Swamy Temple In Guntakal,
Follow us on

మద్యం మాన్పించే దేవుడు.. అవును మీరు విన్నది నిజమే..! ఆ గుడికి ఒక్కసారి వెళ్తే.. తాగుడు మానేస్తారట..! నెలలో రెండు రోజులు ఆ దేవాలయానికి వేల సంఖ్యలో ఎక్కడెక్కడ నుంచో మందుబాబులు క్యూ కడతున్నారట. స్వామివారిని దర్శించుకోవడం వలన మనిషిలోని చెడు గుణాలకి స్వస్తి చెప్పి మంచి నడవడికతో జీవిస్తాడని నమ్మకం. గుడికి వెళితే మందు తాగడం మానేయడం ఏంటి? తాగుడు మానాలంటే ఆ గుళ్ళో ఏం చేస్తారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

మందు బాబులకు మాల ధారణే విరుగుడా? అంటే అవుననే అంటున్నారు మందుబాబులు. అనంతపురం జిల్లాలో ఆ దేవాలయానికి వెళ్లి మాల వేస్తే చాలు మద్యానికి దూరమవ్వాల్సిందేనట..! ఆంధ్ర పుండరీపురంగా పిలవబడే ఉంతకల్లు పాండురంగ స్వామి దేవాలయం మహత్యం గురించి తెలియని మందుబాబులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తాగుడు మాన్పించే దేవుడిగా ఉంతకల్లులో కొలువుదీరిన రుక్మిణి సమేత పాండురంగ స్వామి తాగుబోతుల నుంచి పూజలు అందుకుంటున్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా… నెలలో రెండు రోజులు పాండురంగ స్వామి దేవాలయం మందుబాబులతో కిటకిటలాడుతుంది.

పాండురంగ స్వామి మందుబాబుల పూజలు అందుకోవడమేంటి అని ఆశ్చర్యపోనక్కర్లేదు… ఈ గుడికి అనంతపురం జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు క్యూ కడుతున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో పాండురంగ స్వామిని కొలిచి.. మాల ధరిస్తే ఇక మద్యం ముట్టరట. మెడలో పాండురంగ స్వామి మాల ఉంటే మద్యానికి ఆమడ దూరం పరిగెడతారట మందుబాబులు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలోని ఉంతకల్లు గ్రామంలోని పాండురంగ స్వామి దర్శించుకుని మాల ధరిస్తే… మళ్లీ జన్మలో మద్యం జోలికి వెళ్లరని భక్తుల విశ్వాసం.

పాండురంగ స్వామి మాల ఎప్పుడు పడితే అప్పుడు ధరించడానికి వీలు లేదు. కేవలం నెలలో రెండు రోజులు మాత్రమే మాల ధారణ చేస్తారు. శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి రోజుల్లోనే పాండురంగ స్వామి మాల ధరించాలి. కేవలం తాగుడుకు బానిస అయిన వారు మాత్రమే పాండురంగ స్వామి మాల ధరించడం అనేది కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున.. దాదాపు 2వేల మంది పైచిలుకు భక్తులు పాండురంగస్వామి దర్శనానికి తరలి వస్తుంటారు.

మందు మానేయాలన్న కృతనిశ్చయంతో మాల ధారణ చేయాలనుకున్న వారు తెల్లవారుజామున స్నానాధికాలు ముగించుకొని.. దేవాలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రధాన అర్చకుడు పూజలు చేసి పాండురంగస్వామి మాలను మందుబాబుల మెడలో వేస్తారు. అలా పాండురంగ మాలధారణ చేసిన వారు మళ్లీ మద్యం ముట్టుకున్న దాఖలాలు లేవని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. పాండురంగ స్వామి గుడికి వచ్చి మాల ధారణ చేసుకున్న చాలామంది తాగుబోతులు మద్యానికి దూరమై హాయిగా బతుకుతున్నారట. అందుకే ఉంతకల్లు పాండురంగ స్వామి దేవాలయం మందుబాబులకు ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు.

మెడలో స్వామి మాల ఉన్నంత వరకు ఎలాంటి చెడు వ్యసనాలకు బానిసలు కారు అని గుడికి వచ్చే భక్తుల నమ్మకం. ఒకవేళ మాల ధరించిన తర్వాత కూడా మళ్లీ మద్యం తాగడం మొదలు పెడితే ఆ పాండురంగ స్వామి ఆగ్రహానికి గురై.. కష్టాలు వస్తాయని భయంతో తాగుడు మానేస్తున్నారట తాగుబోతులు. పాండురంగ స్వామి మాల వేసుకున్న తర్వాత… అంతకు ముందు వరకు మద్యానికి బానిసై… కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశామని… మాల వేసుకున్న తర్వాత ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నామని… మందు వాసనే గిట్టడం లేదని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలామంది మందుబాబులు డీ అడిక్షన్ సెంటర్ కు వెళ్లడం మానేసి అనంతపురం జిల్లా ఉంతకల్లు లోని పాండురంగ స్వామి గుడికి క్యూ కడుతున్నారట.

కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, డాక్టర్లు చెప్పినా… మద్యం తాగడం మానని మందుబాబులు…. పాండురంగ స్వామి మాల ధారణ ఒక్కటే, మద్యానికి విరుగుడు అనుకుంటున్నారట మందుబాబులు. చాలా రాష్ట్రాల్లో మద్యం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తుంది. మరీ అలాంటి టాక్స్ పేయర్స్ అందరూ మద్యం మానేస్తే ప్రభుత్వాలు నడిచేదెట్ల అని చమత్కరిస్తున్నారు పాండురంగ స్వామి గుడి మహత్యం తెలుసుకున్న వారు..!

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..