Tirumala Tirupathi Devasthanam: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, సర్వాంతర్యామిగా భక్తులచే పూజింపబడుతున్న శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి త్వరలోనే మహారాష్ట్రంలోని ముంబైలో కూడా కొలువుదీరనున్నాడు. అక్కడి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. అవును.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో ముంబైలో శ్రీవారికి కోవెలను నిర్మిస్తున్నారు. జనవరిలో ఈ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నాటి బీజేపీ-శివసేన ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి తూర్పు బాంద్రాలో కొంత భూమిని కేటాయించింది. ఆ స్థలంలోనే ఇప్పుడు ఆలయ నిర్మాణానికి టీటీడీ ముందడుగు వేసింది. వచ్చే నెల(జనవరి) మొదటి వారంలో ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు అవుతాయని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా తిరుమలేశుడికి భక్తులు ఉన్నారు. వారందరికీ తిరుమలేశుడిని దగ్గర చేయాలనే సంకల్పంతో ఆయా నగరాలు, పట్టణాల్లో టీటీడీ ఆలయాన్ని పోలిన ఆలయాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోనూ టీటీడీ గుడిని నిర్మించాలని నిర్ణయించింది. ఈ ఆలయం పూర్తిగా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంది. హైదరాబాద్లోనూ టీటీడీ ఆలయం ఉంది. తిరుమలలో శ్రీవారు ఎలా ఉంటారో.. ఈ ఆలయాల్లోనూ అలాగే ఉంటారు.
Also read: