TTD: ఉత్సవాలకు ముస్తాబైన తిరుమల.. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు

|

Jul 01, 2022 | 6:15 PM

కలియుగవైకుంఠ వాసుడి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 27నుంచి తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా...

TTD: ఉత్సవాలకు ముస్తాబైన తిరుమల.. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు
Tirumala
Follow us on

కలియుగవైకుంఠ వాసుడి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 27నుంచి తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి. ఈ ఏడాది కరోనా కేసుల సంఖ్య తగ్గడం, వ్యాప్తి తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. అక్టోబరు 1న గరుడ సేవ, 2న బంగారు రథం, 4న మహారథం, 5న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు (Brahmotsava) ముగిస్తాయని వివరించారు. ప్రభుత్వం తరఫున సెప్టెంబర్ 27న స్వామివారికి పట్టు వస్త్రాలు అందించేందుకు సీఎం జగన్ కు ఆహ్వానపత్రిక ఇస్తామని ధర్మారెడ్డి చెప్పారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలతో పాటు వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

కాగా.. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయని ఆధ్యాత్మిక కథనాలు చెబుతున్నాయి. తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే, ఇవి చాలా పెద్దఎత్తున జరిగేవి కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారని పండితులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..