Andal Tirunakshatram: కల్పవల్లి ఆండాళ్ తల్లి.. శ్రీవైష్ణవ ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి పుట్టిన రోజు నేడు

|

Aug 11, 2021 | 10:31 AM

Andal Tirunakshatram : ఈ రోజు ఆండాళ్ తల్లి పుట్టిన రోజు. అందుకనే ఈరోజుని ఆండాళ్ తిరునక్షత్రం అని పిలుస్తారు. కలియుగం ప్రారంభం అయిన 93 వ సంవత్సరంలో ఆండాళ్ తల్లి అవతరించినది. కలియుగం ఆరంభం అయిన..

Andal Tirunakshatram: కల్పవల్లి ఆండాళ్ తల్లి.. శ్రీవైష్ణవ ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి పుట్టిన రోజు నేడు
Andal Thirunakshatram
Follow us on

Andal Tirunakshatram: ఈ రోజు ఆండాళ్ తల్లి పుట్టిన రోజు. అందుకనే ఈరోజుని ఆండాళ్ తిరునక్షత్రం అని పిలుస్తారు. కలియుగం ప్రారంభం అయిన 93 వ సంవత్సరంలో ఆండాళ్ తల్లి అవతరించినది. కలియుగం ఆరంభం అయిన తరువాత నర నామ సంవత్సరంలో పూర్వ పాల్గుని నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణమాస ప్రారంభమైన తరువాత ఆండాళ్ శ్రీరంగం పట్టణంలో జన్మించారు. గోదా దేవి తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి లభించింది. పూలతోటలో లభించిన కుమార్తెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు.

యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచింది. విష్ణుచిత్తులు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకుని వెళ్ళేవారు.. అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగింది. ఓ రోజు ఈ రహస్యం తండ్రి విష్ణుచిత్తులకి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు. దీంతో స్వామి మొహం చిన్నబోతుంది. దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని విష్ణు చిత్తులు బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.

తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి “తిరుప్పావు” వ్రతాచరణ చేసింది. స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది. వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది. అది చూసి విష్ణుచిత్తులు దుఃఖిస్తుంటే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశంచేసి మాయ నుండి వెలుపలకి రావడానికి సాయం చేస్తారు. గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధిచెందింది. దీనిని ధనుర్మాసం లో ప్రతిరోజూ, విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక్క పాశురం చొప్పున పఠిస్తారు.

విష్ణుచిత్తులు చాలా భక్తి కల మహనీయుడు, అందుకే లోకం పెరియ ఆళ్వార్ అని కీర్తించేది. భగవత్ ప్రేమవిషయంలో పెద్దరికం కల వాడు. ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలినవాడు అని అర్థం. భగవత్ ప్రేమ అనేది ఒక పెద్ద సాగరం అని అనుకుంటే, అందులో మునిగి, అడుగుదాకా వెళ్లి తిరిగి బయటికి వచ్చి, ఇంత ఉంది సుమా.. అని ప్రపంచానికి తెలియజేసిన వారిని ఆళ్వారులు అని అంటాం. ఈ ఆళ్వారులు ద్వాపరంలో ఒక నలుగురు, కలియుగంలో మొదటి శతాబ్దానికి చెందినవారు ఒక ఆరుగురు. నమ్మాళ్వార్ తోపాటు ఆయన శిష్యుడైన మధుర కవి, ఇక విష్ణుచిత్తులవారి కుమార్తెగా ఆండాళ్ తో కలిసి మొత్తం పన్నెండు మంది ఆళ్వారులు. భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడిని ఎలా ప్రేమించాలి అని లోకానికి తెలియజేసిన మహనీయులు.

Also Read:  ఇతరులు చేసే తప్పులకు.. వేరొకరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.. చాణుక్యుడు వివరించిన నీతి సూత్రాలు