మహా శివరాత్రి మరుసటి రోజు ఇలా చేస్తే అత్యంత శుభప్రదం.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Maha Shivaratri next day: మహాశివరాత్రి జాగరణ చేసిన భక్తులు మరుసటి రోజు నిద్రపోరాదు. నిద్రపోతే జాగరణ ఫలితం నశిస్తుంది. భోజనం చేసే ముందు పరమేశ్వరుడికి నైవేద్యం సమర్పించాలి. శివ కళ్యాణం అక్షతలు ఐశ్వర్యం, వివాహం, ఆరోగ్యం ప్రసాదిస్తాయి. నిద్ర రాకుండా బొటనవేలికి కొబ్బరి నూనె రాసుకోండి.

మహా శివరాత్రి మరుసటి రోజు ఇలా చేస్తే అత్యంత శుభప్రదం.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
Maha Shivaratri

Updated on: Feb 15, 2026 | 3:12 PM

మహాశివరాత్రి పర్వదినం శివభక్తులకు అత్యంత పవిత్రమైనది. ఈ రోజున భక్తులు జాగరణ చేసి, శివ అభిషేకార్చనలతో పరమేశ్వరుడిని పూజిస్తారు. అయితే, శివరాత్రి మరుసటి రోజు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. వీటిని పాటించకపోతే జాగరణ ఫలితం లభించదని శాస్త్రం చెబుతోంది. జాగరణ చేసిన భక్తులు మరుసటి రోజు పగటి పూట నిద్రపోకూడదు. పగటి నిద్ర వల్ల శివరాత్రి నాడు చేసిన జాగరణ పుణ్యం నశిస్తుందని, దీనిని నిద్రాదేవత వరించి, దరిద్ర దేవతలు పుణ్యాన్ని హరించడానికి వస్తారని పెద్దలు చెబుతారు.

మరుసటి రోజు ఏం చేయాలంటే..?

మరుసటి రోజు ఉపవాసం విరమించి భోజనం స్వీకరించాలి. అయితే, భోజనం చేసే ముందు తప్పకుండా అభిషేకం చేసుకుని, పరమేశ్వరుడికి నైవేద్యం సమర్పించి, స్వామికి వండిన పదార్థాలను నివేదించిన తర్వాతే ప్రసాదంగా స్వీకరించాలి. ఆహారం తీసుకున్న తర్వాత సహజంగా నిద్ర వస్తుంది. ఈ నిద్రను నియంత్రించడానికి, దరిద్ర దేవతలు రాకుండా ఉండటానికి ఒక ప్రత్యేక పరిహారం సూచించబడింది. నిద్రపోకుండా ఉండటానికి, మాట్లాడుతూ లేదా పనులు చేసుకుంటూ కళ్ళు మూతలు పడుతున్నా సరే.. బొటనవేలికి కొబ్బరి నూనె రాసుకోవాలి. బొటనవేలికి కొబ్బరి నూనె రాస్తే నిద్రాదేవత ప్రభావం తగ్గుతుందని, ఆమెతో పాటు వచ్చే దరిద్ర దేవతలు వెంటనే వెనక్కి తిరిగిపోతారని శాస్త్రం చెబుతోంది. ఈ పరిహారం పాటించడం ద్వారా మేల్కొని ఉండి, మీ పనులు, కార్యక్రమాలను నిర్విఘ్నంగా నెరవేర్చడానికి పరమేశ్వరుడు సహకరిస్తాడు.

ఇలా చేస్తే అత్యంత శుభప్రదం..

మహాశివరాత్రి నాడు రాత్రిపూట జరిగే శివ కళ్యాణాన్ని వీక్షించడం కూడా అత్యంత శుభప్రదం. శివ కళ్యాణాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ అక్కడ లభించే అక్షతలను ఇంటికి తీసుకువచ్చి తమ బియ్యం డబ్బాలో వేసినా లేదా బీరువాలో భద్రపరుచుకున్నా అద్వితీయమైన ఐశ్వర్యం లభిస్తుంది. పరమేశ్వరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి ఈ అక్షతలకు ఆ శక్తి ఉంటుంది. వివాహం కాని వారు తమ నెత్తిన ఈ అక్షతలను చల్లుకుంటే గౌరీ దేవి అనుగ్రహంతో త్వరగా వివాహం జరుగుతుంది. అలాగే, ఆరోగ్యప్రదమైన జీవనాన్ని కోరుకునే వారు కూడా శివ కళ్యాణాన్ని వీక్షించి తరించవచ్చు.

శివరాత్రి మరుసటి రోజు ఎటువంటి పరిస్థితులలోనూ నిద్రపోకుండా జాగరూకత వహించడం ద్వారా మహాశివరాత్రి పర్వదినం యొక్క సంపూర్ణ ఫలితాన్ని పొందవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారాన్ని పాఠకుల ఆసక్తి మేరకు అందుబాటులోని వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Loading...
Unable to load recommendations.
Follow Us