Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రారంభం.. భక్తులతో కిటకిటలాడుతున్న వనం..

|

Feb 16, 2022 | 10:07 AM

Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు సమయం ఆసన్నమైంది. మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో ఈ రోజు తెలంగాణ ఆదివాసీ జాతర ప్రారంభమవుతోంది.

Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రారంభం.. భక్తులతో కిటకిటలాడుతున్న వనం..
Medaram Jatara
Follow us on

Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు సమయం ఆసన్నమైంది. మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో ఈ రోజు తెలంగాణ ఆదివాసీ జాతర ప్రారంభమవుతోంది. నేటి నుంచి 19వ తేదీ వరకు జాతర కొనసాగుతుంది. సమ్మక్క, సారలమ్మలను గద్దెలపైకి తీసుకొచ్చే సమయంలో బందోబస్తు ఏర్పాటుపై పోలీసు అధికారులు మాక్‌డ్రిల్‌ చేశారు. మేడారం మహా జాతరలో మంగళవారం తొలి ఘట్టం జరిగింది. పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి మేడారం తీసుకువచ్చే తంతు పూర్తయింది. ఇవాళ సారలమ్మ, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తీసుకొని, జంపన్న వాగును దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇక ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును తీసుకొస్తారు. దీంతో తొలి రోజు ఘట్టం పూర్తి అవుతుంది.

రేపు 17వ తేదీన సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది.సమ్మక్కను చిలకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇదే అత్యంత కీలకమైన ఘట్టం. కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం అందరూ పులకించే అద్భుత ఘట్టం. చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షల మంది భక్తులు పాల్గొని, ఆ తల్లికి జయజయధ్వానాలు పలుకుతూ హారతులు ఇస్తారు.

ఈ సమయంలో పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి మరీ ఘన స్వాగతం పలుకుతారు. 18న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న అంతా గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 19న దేవతల వన ప్రవేశం ఉంటుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాలా చర్యలు చేపట్టింది.

వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ర్టాలతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. వాహనాలతో పార్కింగ్‌ స్థలాలు నిండిపోతున్నాయి. వీఐపీ, వీవీఐపీల పార్కింగ్‌ ఏరియాలు కూడా రద్దీగా మారాయి. మేడారం జనసంద్రంగా మారింది. సమ్మక్క, సారలమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో మేడారం కిటకిటలాడుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్‌ జామ్స్‌ లేకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని సూచిస్తున్నారు.

వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో మేడారం రూట్‌ను వన్‌వేగా మార్చారు పోలీసులు. తాడ్వాయి నుంచి మేడారం మార్గంలో ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ వెహికల్స్‌కి మాత్రమే అనుమతిస్తున్నారు. హైదరాబాద్‌, హన్మకొండ నుంచి వాహనాలను పస్రా మీదుగా తరలిస్తున్నారు. మహారాష్ట్ర, కాళేశ్వరం, కరీంనగర్‌ నుంచి వాహనాలను కాల్వపల్లి మీదుగా మేడారం వచ్చేలా ఏర్పాట్లు చేశారు పోలీసులు.

Also Read:

Statue of Equality: సమతామూర్తిని సందర్శించే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి….

Medaram Maha Jatara 2022: ప్రధాన వేదిక మేడారమే అయినా చాలా చోట్ల జరిగే జాతర