Jagannath Rath Yatra 2021: రెండో ఏడాది భక్తులు లేకుండానే పూరి జగన్నాథ యాత్ర.. వెబ్‌క్యాస్టింగ్‌తో ఉత్సవాల వీక్షణకు ఛాన్స్!

|

Jun 11, 2021 | 9:42 AM

వరుసగా రెండో ఏడాది కూడా పూరి జగన్నాథ యాత్ర బోసిపోయి కన్పించబోతోంది. కరోనా కారణంగా రథయాత్రకు భక్తులను అనుమతించడం లేదని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.

Jagannath Rath Yatra 2021: రెండో ఏడాది భక్తులు లేకుండానే పూరి జగన్నాథ యాత్ర.. వెబ్‌క్యాస్టింగ్‌తో ఉత్సవాల వీక్షణకు ఛాన్స్!
Lord Jagannath Rath Yatra
Follow us on

Lord Jagannath Rath Yatra 2021: వరుసగా రెండో ఏడాది కూడా పూరి జగన్నాథ యాత్ర బోసిపోయి కన్పించబోతోంది. కరోనా కారణంగా రథయాత్రకు భక్తులను అనుమతించడం లేదని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా మహమ్మారితో సామాన్యులకే దేవుళ్లకు కూడా తీరని కష్టాలు వచ్చాయి.
వరుసగా రెండో ఏడాది ప్రపంచ ప్రసిద్ది గాంచిన పూరి జగన్నాథ రథయాత్రను భక్తులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ను పాటిస్తూ రథయాత్రను నిర్వహిస్తామని ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పరిమిత స్థాయిలో భక్తులు. అర్చకులు జగన్నాధుడి రథయాత్రలో పాల్గొంటారు. అది కూడా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవాళ్లు , కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవాళ్లతోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం జులైలో జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తారు. ప్రతి ఏటా పూరి జగన్నాథరథయాత్రను లక్షలమంది భక్తులతో కన్నుల పండువగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కాని కరోనా మహమ్మారి కారణంగా ఈ ఉత్సవాలను నామమాత్రంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతోనే రథయాత్రను నిర్వహిస్తామని ఒడిశా స్పెషల్‌ రిలీఫ్‌ కమిషనర్‌ పీకే జెనా తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. జగన్నాథ రథయాత్ర నిర్వహించే రోజున పూరిలో కర్ఫ్యూ విధిస్తామని కూడా ఆయన ప్రకటించారు.

పూరిలో తొమ్మిదిరోజుల పాటు సాంప్రదాయరీతిలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. భక్తులు ప్రత్యక్ష ప్రసారంతో వెబ్‌క్యాస్టింగ్‌తో ఉత్సవాలను వీక్షించవచ్చని రిలీఫ్‌ కమిషనర్‌ తెలిపారు. పూరికి వాహనాల రాకపోకలపై నిషేధం అమల్లో ఉంటుంది. అత్యవసర సేవలకు మాత్రమే ఆరోజు అనుమతి ఉంటుంది.

ఇదిలావుంటే, పూరి నగరంలో ఇప్పటికి కూడా ప్రతిరోజు 300కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. రథాల తయారీ ఆఖరి దశకు చేరుకుందని కూడా అధికారులు వెల్లడించారు. జగన్నాధుడు తన సోదరుడు బలభద్రుడు , సుభద్రతో కలిసి రథయాత్ర నాడు ఊరేగడం ఆనవాయితీగా వస్తోంది. రథయాత్ర రెండున్నర కిలోమీటర్ల మేర సాగి గుండిచ ఆలయానికి చేరుకుంటుంది. ఈ దృశ్యాన్ని భక్తులు ఎంతో పారవశ్యంతో తిలకిస్తారు. కాని ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది.

Read Also…  AP Governor Quota MLC: ఏపీలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు.. గవర్నర్‌కు నలుగురి పేర్లు సిఫారసు..!