
శివ నామస్మరణతో జమ్మూ కాశ్మీర్ మారుమోగిపోతోంది. లక్షలాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవిత్ర అమర్నాథ్ యాత్ర గురువారం (జూలై 02) ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున 4:50 గంటలకు జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్’ బేస్ క్యాంప్ నుండి యాత్రికుల తొలి బృందాన్ని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తొలి విడతలో భాగంగా పహల్గామ్, బల్తాల్ మార్గాల ద్వారా ప్రయాణించేందుకు సుమారు 6,000 నుండి 7,000 మంది భక్తులు తరలివెళ్లారు. బేస్ క్యాంప్ అంతా ‘బమ్ బమ్ భోలే’, ‘హర్ హర్ మహాదేవ్’ అనే నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. బాబా బర్ఫానీ (మంచు శివలింగం) దర్శనం కోసం దేశం నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులతో బేస్ క్యాంప్లు కిక్కిరిసిపోయాయి.
రెండు మార్గాల్లో పవిత్ర గుహ వైపు ప్రయాణం
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 03 నుండి ప్రారంభమై ఆగస్టు 28 వరకు మొత్తం 57 రోజుల పాటు సాగనుంది. తొలి బృందంలో బయలుదేరిన భక్తులు రెండు మార్గాల ద్వారా పవిత్ర గుహకు చేరుకోనున్నారు. బల్తాల్ మార్గం ఇది సన్నని, కొండ మార్గం. ఈ మార్గం గుండా వెళ్లే భక్తులు జూలై 3వ తేదీన పవిత్ర గుహకు చేరుకుని బాబా బర్ఫానీని దర్శించుకుంటారు. ఇక పహల్గామ్ మార్గం సాంప్రదాయకమైన ఈ సుదీర్ఘ మార్గం గుండా ప్రయాణించే భక్తులు జూలై 4వ తేదీన పవిత్ర గుహకు చేరుకుంటారు. భక్తులు యాత్ర ప్రారంభ రోజుల్లోనే వెళితే, మంచు శివలింగంపూర్తి రూపంలో దర్శనమిస్తుందనే ఆశతో ఎంతో ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రత.. డ్రోన్లతో నిఘా!
అమర్నాథ్ యాత్ర సురక్షితంగా, ప్రశాంతంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. యాత్రా మార్గంతో పాటు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (NH-44) పొడవునా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. సిసిటివి (CCTV) కెమెరాలు, అత్యాధునిక డ్రోన్ నిఘా మరియు నిరంతర గస్తీ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రక్షణే తమకు అత్యంత ప్రాధాన్యత అని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. గత రికార్డులను బ్రేక్ చేస్తూ ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.. యాత్రికులందరూ బోర్డు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..