Jagannath Miracle: పూరీ జగన్నాథుడు చేపలు తిన్నాడని మీకు తెలుసా..? అప్పుడే జరిగిందీ అద్భుతం..!

Puri Jagannath, Koorma story: ఒకప్పుడు పూరీ నగరంలో కూర్మ అనే మత్స్యకారిణి ఉండేది. ఆమె జగన్నాథుడికి చేపను సమర్పించగా, అది అద్భుతంగా పనసపండుగా మారింది. ఈ ఘటనతో కూర్మ శాకాహారిగా మారి, ప్రతిరోజూ పనసపండ్లను జగన్నాథుడికి ప్రసాదంగా సమర్పించేది. ఇది పూరి జగన్నాథుడి మహిమ, భక్తురాలి పట్ల ఆయన ప్రేమకు నిదర్శనం.

Jagannath Miracle: పూరీ జగన్నాథుడు చేపలు తిన్నాడని మీకు తెలుసా..? అప్పుడే జరిగిందీ అద్భుతం..!
Puri Jagannath

Updated on: Feb 04, 2026 | 4:05 PM

పూరీ క్షేత్రం మోక్షానికి ద్వారం అని శాస్త్రాలు చెబుతాయి. పూరీ జగన్నాథుడు అంటే కేవలం ఒక దేవాలయంలోని విగ్రహం కాదు.. ఆయన అనంతమైన కరుణకు, సమానత్వానికి ప్రతీక. జగన్నాథుడు అంటే “ప్రపంచానికి అధిపతి”.. కానీ ఆయన అధిపత్యం భయం ద్వారా కాదు, ప్రేమ ద్వారా మాత్రమే. కులం, మతం, స్థితి అనే భేదాలన్నిటినీ కరిగించి, తన భక్తుడిని హృదయానికి హత్తుకునే దేవుడు ఆయన. అపూర్ణంగా కనిపించే ఆయన విగ్రహమే, ఈ సృష్టిలో సంపూర్ణత అనేది రూపంలో కాదు, భావంలో ఉందని బోధిస్తుంది. అందుకే జగన్నాథుడు భక్తుడి కన్నీటిలోనూ, ఆనందంలోనూ సమానంగా ప్రత్యక్షమవుతాడు.

పూరీ జగన్నాథుడి లీలలు మనకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని చెబుతాయి. దేవుడు దూరంలో ఉండే శక్తి కాదు, మనతో కలిసి నడిచే స్నేహితుడు. రథయాత్రలో ఆయన గర్భగుడిని విడిచి భక్తుల మధ్యకు రావడం.. అహంకారాన్ని విడిచిపెట్టి వినయాన్ని నేర్పే మహా సందేశం. మన జీవితం ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా.. హృదయంతో పిలిస్తే జగన్నాథుడు తప్పకుండా స్పందిస్తాడు. ఆయన దర్శనం ఒక చూపు కాదు.. అది మనలోని భయాన్ని కరిగించి, విశ్వాసాన్ని వెలిగించే అనుభూతి.

జగన్నాథుడి కోసం చేపలు తెచ్చిన భక్తురాలు

పూరీ జగన్నాథుడి(Puri Jagannath)కి సంబంధించిన ఒక ఆధ్యాత్మికమైన ఒక చిన్న సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూరీ నగరంలో కూర్మ అనే ముసలావిడ నివసించేది. ఆమె మత్స్యకారిణి కావడంతో ప్రతిరోజు చేపలను ఆహారంగా తీసుకునేది. ఒకరోజు కూర్మ జగన్నాథుడి దర్శనానికి వెళ్ళినప్పుడు, స్వామి వారికి సమర్పించే ప్రసాదంలో తీపి పదార్థాలు మాత్రమే ఉండడం గమనించింది. కారంగా ఉండే వంటకాలు లేకపోవడం చూసి, తాను నిత్యం తినే చేపలు కచ్చితంగా జగన్నాథుడికి నచ్చుతాయని భావించింది. భక్తితో ఒక చేపను అరిటాకులో చుట్టి ప్రసాదంగా సమర్పించేందుకు గుడికి తీసుకువెళ్ళింది.

ఆ భక్తురాలిపై జగన్నాథుడి కటాక్షం

కానీ, గుడి ద్వారం వద్ద ఉన్న కాపలాదారులకు చేప వాసన రావడంతో, ఆమె చేతిలోని అరిటాకును కర్రతో కొట్టి కింద పడవేశారు. అయితే విచిత్రంగా ఆ అరిటాకు కింద పడగానే, చేపకు బదులుగా పనసపండు కనిపించింది. ఈ అద్భుతాన్ని చూసి కూర్మతో పాటు కాపలాదారులు కూడా ఆశ్చర్యపోయారు. కాపలాదారులు క్షమాపణ చెప్పి ఆ పనసపండును జగన్నాథుడికి సమర్పించారు. తన పట్ల జగన్నాథుడు చూపిన ప్రేమకు కూర్మ ఎంతో సంతోషించింది. ఆరోజు నుంచీ ఆమె పూర్తిగా శాకాహారిగా మారి, ప్రతిరోజూ జగన్నాథుడికి పనసపండ్లను ప్రసాదంగా సమర్పించేది. ఈ విధంగా పూరీ జగన్నాథుడు తన మహిమతో భక్తురాలి మనసు గెలుచుకున్నాడు. అందుకే ఆయనను భక్తవత్సలుడు అని అంటారు.