చంద్రగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఈసీ ప్రకటన జారీచేసిన నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. రీపోలింగ్ అంటే చంద్రబాబుకు, టీడీపీకి ఎందుకు భయమో చెప్పాలని అన్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు గారూ, రీపోలింగ్ అంటే మీకెందుకు భయం? రీపోలింగ్ జరపడం అప్రజాస్వామికమా? లేక, రిగ్గింగ్ చేయడం అప్రజాస్వామికమా? చంద్రగిరిలో దళితులను ఓటెయ్యనివ్వకుండా వారి ఓట్లన్నీ మీరే వేయడం అప్రజాస్వామికమా? లేక, చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీ అరాచకాలకు అడ్డుపడడం అప్రజాస్వామికమా? అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, చంద్రగిరి అసెంబ్లీ స్థానంలోని ఐదు నియోజకవర్గాల్లో రీపోలింగ్ ప్రజాస్వామికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ జగన్ ఈసీని కోరారు.
.@ncbnగారూ రీపోలింగ్ అప్రజాస్వామికమా?లేక రిగ్గింగా? చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయకుండా వారి ఓట్లు మీరు వేయటం అప్రజాస్వామికమా?లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డు పడటమా?రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు? అయిదు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ ప్రజాస్వామికంగా జరిపించాలని ఈసీని కోరుతున్నా.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 17, 2019