తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌ వివాదంలో బండి సంజయ్ రాజకీయాలు మానాలి : జగదీష్ రెడ్డి

Telangana Minister Jagadish Reddy : తెలుగు రాష్ట్రాల మ‌ధ్య తలెత్తిన జ‌ల‌వివాదంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌ వివాదంలో బండి సంజయ్ రాజకీయాలు మానాలి : జగదీష్ రెడ్డి
Ts Minister Jagadish Reddy

Updated on: Jul 04, 2021 | 2:56 PM

Telangana Minister Jagadish Reddy : తెలుగు రాష్ట్రాల మ‌ధ్య తలెత్తిన జ‌ల‌వివాదంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయాలు మానాలని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ హక్కులను కేంద్ర స‌ర్కారుకి అప్పజెప్పాల‌న్నట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి మండిపడ్డారు. ఇకనైనా నదీ జలాల విషయంలో రాజకీయాలు మాని తెలంగాణ ప్రభుత్వ చర్యలకు మద్దతు పలకాలని ఆయన కోరారు. బండి సంజయ్‌కి కృష్ణానదీ జ‌లాల‌ పంపిణీపై అవగాహన లేదని మంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో పాలిటిక్స్ మాని ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికి కలిసి రావాలని ప్రతిపక్షాలకు జగదీష్ రెడ్డి సూచించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య జ‌ల వివాదం కొన‌సాగుతున్నప్పటికీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కారు పట్టించుకోవ‌ట్లేద‌ని జగదీష్ రెడ్డి విమ‌ర్శించారు. కృష్ణా నదీ జలాలను న్యాయంగా వాడుకోవాల‌ని ఇప్పటికే ఏపీ సీఎం జగన్ కు.. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పార‌ని మంత్రి తెలిపారు. కృష్ణా నదిపై గత అనుమతులతోనే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం జగన్ చెప్పారని, అయితే, గత తెలంగాణ నేతల‌కు ఆయా ప్రాజెక్టులపై అవ‌గాహ‌న‌ లేక ఎన్నో ఏళ్లుగా ఆంధ్రాకు లాభం చేకూర్చార‌ని మంత్రి వెల్లడించారు.

అంతేకాదు, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి నీళ్ల విషయంలో స్పష్టత అవసరమని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పార‌ని మంత్రి వెల్లడించారు. న‌దీ జ‌లాల‌ వృథా నీటిని పద్ధతిగా వాడుకుందామని సీఎం కేసీఆర్, ఏపీ సీఎంకు సూచించారని మంత్రి తెలిపారు. కాగా, రాయలసీమను రతనాల సీమను చేస్తామన్న సీఎం కేసీఆర్‌ మాట ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించడాన్ని మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హుజురాబాద్‌ ఎన్నికల కోసమే ప్రాజెక్ట్‌ల హడావుడి చేస్తున్నారని బండి సంజయ్ చేసిన విమర్శలను తీవ్రంగా దుయ్యబట్టిన జగదీష్ రెడ్డి, తెలంగాణ హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

Read also :  Liquor Transport : కోళ్ల వ్యర్ధాల మధ్యన మద్యం బాటిల్స్ తరలిస్తోన్న ముఠా గుట్టురట్టు