ప్రధాని మిషన్ శక్తి ప్రసంగంపై ఈసీకి ఫిర్యాదు చేసిన విపక్షాలు.. పరిశీలిస్తున్న ఎన్నికల సంఘం

| Edited By: Vijay K

Mar 28, 2019 | 8:42 PM

న్యూఢిల్లీ : శాస్త్ర విజ్ఞాన రంగంలో భారత్‌ ఎంత గొప్ప విజయం సాధించినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో దాని గురించి ఇలా చాటింపు వేయడం కచ్చితంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనంటూ కాంగ్రెస్‌ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ కూడా పరిశీలిస్తోంది. దీనిని పరిశీలించేందుకు సంఘం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందా లేదా అనే విషయాన్ని […]

ప్రధాని మిషన్ శక్తి ప్రసంగంపై ఈసీకి ఫిర్యాదు చేసిన విపక్షాలు.. పరిశీలిస్తున్న ఎన్నికల సంఘం
Follow us on

న్యూఢిల్లీ : శాస్త్ర విజ్ఞాన రంగంలో భారత్‌ ఎంత గొప్ప విజయం సాధించినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో దాని గురించి ఇలా చాటింపు వేయడం కచ్చితంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనంటూ కాంగ్రెస్‌ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ కూడా పరిశీలిస్తోంది. దీనిని పరిశీలించేందుకు సంఘం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందా లేదా అనే విషయాన్ని ఈ కమిటీ దర్యాప్తు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ‘శాస్త్రవేత్తలు ‘లో ఎర్త్ ఆర్బిట్‌’లో 300 కిలోమీటర్ల దూరంలోని ఒక లైవ్ శాటిలైట్‌ను కూల్చేశారు. ఈ ఆపరేషన్ ‘మిషన్ శక్తి’ భారత్ యాంటీ శాటిలైట్ మిస్సైల్ ఏ-శాట్ ద్వారా కేవలం మూడు నిమిషాల్లో పూర్తి చేశారని’ తెలిపారు.

మోడీ ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి..ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా ఆరోపించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగిందని సీపీఎం ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ఫిర్యాదు చేసింది. కాగా.. మోడీ చేసింది రాజకీయ ప్రకటన అంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ప్రకటన చేయాలి. ఇది వాళ్ల ఘనత. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించిన క్రెడిట్ తన ఖాతాలో వేసుకొనేందుకు కాకపోతే మోడీ ఈ ప్రకటన చేయాల్సిన అవసరమేంటి? ఆయనేమైనా ఈ మిషన్ లో పని చేశారా? ఆయన అంతరిక్షంలోకి వెళ్లారా? దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని’ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ట్వీట్టర్ లో పేర్కొన్నారు.

అయినా మోదీ సర్కార్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన ఆరోపణలు రావడం ఇప్పుడే కాదు.. గత కొన్ని రోజులుగా వరుసగా వస్తూనే ఉన్నాయి. నరేంద్ర మోదీపై తీసిన బయోపిక్‌ పీఎం నరేంద్ర మోదీ చిత్రం ఏప్రిల్‌ ఐదవ తేదీన విడుదలవుతున్న సందర్భంగా ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మోదీ బయోపిక్‌ చిత్రాన్ని విడుదల చేయడమంటే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనన్న ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌ పరిశీలిస్తోంది. రైలు, విమానయాన టిక్కెట్లపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలను ఎందుకు తొలగించలేదో వివరణ ఇవ్వాలంటూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌ కేంద్ర రైల్వే, విమానయాన శాఖలకు నోటీసులు జారీ చేసింది. మేమంతా బీజేపీ కార్యకర్తలం, మెదీ తప్పకుండా గెలిచి మళ్లీ పీఎం కావాలి అంటూ రాజస్థాన్‌ గవర్నర్‌ కళ్యాణ్‌ సింగ్‌ బహిరంగంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.