గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ సెంటర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా ఉత్సాహంగా మాట్లాడిన బాబు ఐదేళ్లపాటు సంతృప్తికరంగా పాలన సాగించానని, ప్రజల సంతోషమే లక్ష్యంగా పరిపాలన చేశానని అన్నారు. కృష్ణా డెల్టాలో నీరు లేకపోతే పట్టిసీమ నిర్మించాను, గోదావరి నీటితో డెల్టాలో దిగుబడి పెరిగింది.
పట్టిసీమ రాకపోతే కృష్ణా జిల్లా ఏమయ్యేదో ఆలోచించాలి, జులై నుంచి పోలవరం ద్వారా గ్రావిటీతో నీరందిస్తాను. రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. రాష్ట్రంలో అన్ని నదుల్ని అనుసంధానం చేస్తాను, కృష్ణా గోదావరి నదుల అనుసంధానంతో అది ప్రారంభించాను. రెండువేలు ఇస్తున్న పెన్షన్ను మూడు వేలకు పెంచుతాను, అన్ని విధాలా అండగా ఉంటాను అని చంద్రబాబు చెప్పారు. అందరూ ఏకపక్షంగా టీడీపీకి ఓటేయాలని, కేంద్రం సహకరించకపోయినా రూ. 24,500 కోట్ల రుణమాఫీ చేశాను.
కౌలు రైతులతో సహా అందరి రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తాను. రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాను. పట్టణ ప్రాంతాల వారికి కూడా ఉచితంగా ఇళ్లు అందిస్తానని చంద్రబాబు చెప్పారు. నేను మీ కోసం కష్టపడుతుంటే నాకు బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ అడ్డుపడుతున్నాయని చంద్రబాబు ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్నారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టిన గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరుపున దేవినేని అవినాష్ పోటీ చేస్తుండగా, వైసీపీ తరుపున కొడాలి నాని పోటీ చేస్తున్నారు.