
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల కసరత్తు… మళ్లీ కాకరేపుతోంది. స్థానిక ఎన్నికల వివాదం వైసీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య ఇంకా కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఓవైపు అన్ని రాజకీయ పార్టీలతో బుధవారం భేటీ అయ్యేందుకు ఈసీ కసరత్తు చేస్తుండగా.. కరోనా నేపథ్యంలో ఇప్పట్లో ఆ ఆలోచన లేదని అధికార పక్షం వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు అన్ని పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జరిపే సమావేశానికి అధికార పార్టీ హాజరవుతుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమై సమయంలో కరోనా విజృంభణ కారణంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ నిరవధికంగా వాయిదా వేశారు. అన్లాక్ ద్వారా కేంద్రం అన్నిటికీ అనుమతులు ఇస్తున్న తరుణంలో ఎన్నికలను కూడా జరపొచ్చన్న కారణంతో నిమ్మగడ్డ ముందుకెళ్తున్నారు. అయితే, కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉందని, అలాంటప్పుడు ఎన్నికలకు ఎలా వెళ్తారన్న ప్రశ్నను అధికార పార్టీ నేతలు లేవనెత్తుతున్నారు. ఒకవేళ మిగిలిన పార్టీలు సమావేశానికి హాజరైతే ఎలాంటి అభిప్రాయాలు వెల్లడిస్తాయి, ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మరోవైపు రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలన్నింటికీ ఇప్పటికే ఆహ్వానం పంపారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జరగనున్న ఈ సమావేశానికి.. ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధి మాత్రమే రావాలని ఈసీ సూచించారు. ఇక, అటు టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరువుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. మిగిలిన పార్టీల తరపున కూడా ప్రతినిధులు వస్తారన్న ప్రచారం సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియలో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని, ఏకగ్రీవాలు అన్ని రద్దు చేయాలని టీడీపీ సహా అన్ని విపక్షాలు కోరుతున్నాయి.
తొలుత ఆరు వారాలు, తర్వాత లాక్ డౌన్ వల్ల నిరవధికంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇదే క్రమంలో ఎస్ఈసీ తొలగింపు- కోర్టు చుట్టూ తిరగడాలు, మళ్లీ నియామకం జరిగాయి. చివరికి, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నేతృత్వంలో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్నది తేలాల్సివుంది. కరోనా చుట్టూ ఎన్నికల అంశం తిరుగుతుండడంతో అధికార వైసీపీ.. ఎన్నికల కసరత్తుకు సహకరిస్తుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.