
భాజపా వ్యవస్థాపక సభ్యులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీని సోమవారం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వేరు వేరుగా కలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన కొన్ని గంటల తరవాత ఆయన వారి వద్దకు వెళ్లారు. ఈ ఎన్నికల సమరంలో వారిని అమర్యాదకరంగా పార్టీకి, పోటీకి దూరం చేశారని విపక్షాలు ఆరోపణలు చేస్తోన్న తరుణంలో… వాటిని సద్దుమణచడానికి, ఆ అగ్రనేతలను బుజ్జగించడానికి ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
చాలా కాలంగా గుజరాత్లోని గాంధీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ స్థానం నుంచి అమిత్ షా పోటీ చేయనున్నట్లు గత నెల పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై కొద్ది రోజుల తరవాత బ్లాగ్ ద్వారా స్పందించిన అద్వానీ… విమర్శకులను పార్టీ ఎప్పుడు జాతి వ్యతిరేకులుగా చూడలేదని, ప్రజాస్వామ్య విధానాలకు పార్టీ పెట్టింది పేరని సందేశం ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను ఉద్దేశించే ఆయన అలా వ్యాఖ్యానించారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. అలాగే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ తనను కోరిందని… జోషీ తన మద్దతుదారులకు బహిరంగ లేఖ రాసి, పార్టీ అభిప్రాయాన్ని ప్రకటించారు.