
మే 23న జరిగే ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరుతూ ప్రతిపక్ష.. నేతలు ఈసీని కలిశారు. ఒక్క పోలింగ్ బూత్లోని వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడాలు వచ్చినా.. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈవీఎంల కన్నా ముందే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన సమాధానం ఆధారంగా 22 విపక్ష పార్టీల నేతలు తదుపరి కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. అటు తమ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఓటర్లలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత ఈసీదేనని అన్నారు. మరోవైపు కౌంటింగ్ పూర్తైన తర్వాత ఈవీఎం, వీవీప్యాట్లను లెక్కింపు కేంద్రాల్లో భద్రపరచాలని విపక్షనేతలు డిమాండ్ చేశారు.
కాగా, అంతకు ముందు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఎన్డీయేతర పక్షాల నేతలంతా సమావేశమయ్యారు. ఆయా పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. టీడీపీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లట్, అభిషేక్ మను సింఘ్వీ, ఆప్ నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆ పార్టీ నేత సంజయ్ సింగ్, సీపీఐ నుంచి సురవరం సుధాకర్రెడ్డి, డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే నేత కణిమొళి, ఆర్జేడీ నేత మనోజ్ ఝూ, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, ఎస్పీ నుంచి రామ్కృపాల్ యాదవ్, టీఎంసీ నుంచి డెరెక్ ఒబ్రెయిన్, బీఎస్పీ నుంచి సతీశ్చంద్ర మిశ్రా, ఎస్పీ నుంచి దేవేందర్రాణా హాజరై ఈసీ విధానాలు, మహాకూటమి గురించి చర్చించారు. అయితే ఈ భేటీకి జేడీయూ నుంచి కర్ణాటక సీఎం కుమారస్వామి హాజరుకాల్సి ఉండగా… ఆకరి నిమిషంలో డుమ్మా కొట్టారు.