
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన గట్టెం వెంకటేష్.. సూక్ష్మ కళాకారుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పెన్సిల్ మొనపై అద్భుతమైన కళారూపాలకు జీవం పోస్తూ తన కాళాపోషణతో ఔరా అనిపిస్తున్నాడు.

తాజాగా వెంకటేష్ అద్భుతమైన ఫీట్ను సాధించాడు. తన అద్భుత ప్రతిభతో పెన్సిల్ ముళ్ళు పై ప్రపంచంలోనే అతి చిన్న తాజ్ మహల్ చెక్కాడు. నాలుగు మిల్లిమీటర్ల ఎత్తు, నాలుగు మిల్లిమీటర్ల వెడల్పుతో తాజ్ మహల్ను పెన్సిల్ మొనపై రూపొందించి ఔరా అనిపించ్చాడు.

ఏప్రిల్ 27, 20205న అతిచిన్న తాజ్ మహల్ రూపొందించిన గట్టెం వెంకటేష్.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కు తన అతి సూక్ష్మ కళా ఖండాన్ని పంపించాడు. దీంతో అతని ప్రతిభను గుర్తించిన పరిశీలకులు వెంకటేష్కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు కల్పించారు.

ఈ తాజా ఫీట్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వెంకటేష్ అతి చిన్న వయస్సులోనే ప్రపంచలోనే అత్యంత సూక్ష్మ తాజ్ మహల్ను రూపొందిన వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇది వెంకటేష్కు మరో అరుదైన గుర్తింపును తెచ్చి పెట్టింది.

ఇప్పటికే అనేక దేవతామూర్తుల విగ్రహాలు, కళారూపాలను పెన్సిల్ మొనపై చెక్కి ప్రశంసలు అందుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్తో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్న వెంకటేష్.. పెన్సిల్పై చెక్కిన ఈ అద్భుతమైన కళాఖండం తాజ్ మహల్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.