
సముద్రంలో మునిగిపోయిన తమ జలాంతర్గామిని గుర్తించేందుకు ఇండోనేసియా నావికాదళం గాలింపు ముమ్మరం చేసింది. ఐదు నౌకలు, ఓ హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపింది.

సముద్రాల్లో గాలింపు కోసం ఉపయోగించే అధునాతన సాంకేతికత ఉన్న ఓ సర్వే నౌకను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించింది.

600-700 మీటర్ల లోతుకు జలాంతర్గామి పడిపోయి ఉంటుందని ఇండోనేషియా నావికాదళం భావిస్తోంది. ఇండోనేసియా సైన్యానికి సహాయంగా భారత్ సైతం రంగంలోకి దిగింది.

జలాంతర్గామి గల్లంతైన ప్రాంతానికి 2.5 నాట్స్ దూరంలో నీటి కదలికలను గుర్తించినట్లు ఇండోనేసియా ఆర్మీ తెలిపింది.

ప్రమాదం జరిగిన జలాంతర్గామిలో 53 మంది ఉన్నారు. బాలీ తీరంలో నంగ్గల్ల-402 అనే జలాంతర్గామి బుధవారం గల్లంతైంది. టార్పిడోలను పరీక్షించే సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.