
స్కూల్కు వెళ్లే ముందు పిల్లలు ఏడవడం సహజం. దీనికి ఉన్న ముఖ్య కారణం చాలా రోజుల పాటు తల్లిదండ్రులతో సంతోషంగా గడిపి, ఒక్కసారిగా ఎవరూ తెలియని ప్రదేశంలోకి వెళ్లడం. దీంతో కాస్త భయాందోళనకు గురి అవుతుంటారు. కానీ తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది. అయితే మరికొంత మంది మాత్రం స్కూల్కు సవ్యంగా వెళ్లినా, కొన్ని రోజుల తర్వాత పాఠశాలకు వెళ్లమంటే ఏడుస్తుంటారు. అయితే ఇలా మీ పిల్లలకు కూడా మొదట్లో బాగానే బడికి వెళ్లి, తర్వాత వెళ్లను అంటూ మెండికేస్తున్నారు అంటే, దీనిని అస్సలే లైట్ తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. కాగా, అసలు దీనికి గల కారణాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

వేధింపులు : పాఠశాలకు వెళ్లిన మీ పిల్లలు వేధింపులకు గురి అవుతున్నారేమో గుర్తించాలి. కొన్ని సార్లు తోటి పిల్లలు గుంపులుగా చేరి మీ బిడ్డను ఆట పట్టించడం, వేధించడం చేస్తుంటారు. దీని వలన వారు మానసికంగా కుంగిపోయి, భయానికి పాఠశాలకు వెళ్లనంటూ ఏడుస్తుంటారు.

ఉపాధ్యాయుల ప్రవర్తన : కొంత మంది ఉపాధ్యాయులు చాలా కోపం కలిగి ఉంటారు. చిన్న తప్పుకే పిల్లలను బెదిరించడం, తిట్టడం చేస్తుంటారు. అదువలన మీ పిల్లాడిపై ఉపాధ్యాయుల ప్రభావం, వారి పట్ల భయం ఉందేమో తెలుసుకోవాలి. వారిని బుజ్జగించి మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.

అంతే కాకుండా కొన్ని సార్లు సరదాగా అన్న మాటల కూడా పిల్లలను మనోవేదనకు గురి చేస్తుంటాయి. ఉదాహరణకు , నల్లగా ఉన్నావు అని లేదా లావుగా ఉన్నావంటూ పిలవడం చేయడం వలన అది పిల్లాడి మనసును గాయపరుస్తుంది. అందువలన ఇలాంటి విషయాలను కూడా తెలుసుకోవాలి.

మరీ ముఖ్యంగా మీ పిల్లలు చదువులో వెనకబడి ఉన్నారేమో తెలుసుకోవాలి. చాలా మంది పిల్లలు చదువులో వెనకబడి, మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. దీంతో స్కూల్కు వెళ్లనంటూ మారం చేస్తారు. అందువలన వారు చదువులో వెనకబడి ఉన్నారా? అనేది తెలుసుకోవాలి, వారికి నచ్చజెప్పి, మంచిగా ప్రిపేర్ అయ్యేలా చూడాలి, ఎలా ముందుకు వెళ్లాలో చెప్పాలి. అలాగే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయో కూడా చూడాలి.