
చంద్రుడిపై అన్వేషణ పలు దేశాలకు సవాలుగా మారింది. గతంలో అమెరికా చంద్రునిపై కాలు మోపగా రష్యా, చైనా దేశాలు తమ రోవర్లను అక్కడ విజయవంతంగా దించగలిగాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే భారత్ చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది.

ఇస్రో రాకెట్ను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినప్పటికీ.. జాబిల్లిని చేరాలంటే దాదాపు 40 రోజులు పడుతుంది. దశాబ్దాల క్రితం అమెరికా చేపట్టిన అపోలో 11కు మాత్రం కేవలం నాలుగు రోజులే పట్టింది. రష్యాకైతే ఒకటిన్నర రోజులే. అయితే ఇస్రో ఎందుకు ఇంత సమయం తీసుకుంటోందో ఇప్పుడు తెలుసుకుందాం.

భూమి నుంచి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రున్ని చేరుకోవాలంటే తక్కువ రోజుల్లోనే చేరుకోవచ్చు. కానీ అందుకు శక్తిమంతైన రాకెట్ వాడాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువగా ఇంధనం కావాల్సి ఉంటుంది. అమెరికా 1969 లో చేపట్టిన అపోలో 11 ప్రయోగానికి ఇలాంటి భారీ రాకెట్ను వినియోగించింది. రష్యా, చైనాలు కూడా ఎక్కువ ఖర్చు పెట్టి భారీ రాకెట్లను చంద్రునికి మీదకి తక్కువ కాలంలోనే పంపించాయి.

అయితే ఇస్రో మాత్రం కేవలం రూ.615 కోట్లతోనే చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టింది. తక్కువ వేగంతో వెళ్లడం, ప్రాజెక్టు ఖర్చుని దృష్టిలో పెట్టుకొని ఇస్రో భిన్న మార్గాన్ని ఎంచుకుంది. భూమి గ్రావిటీ సహాయంతో చంద్రుని వైపు ప్రయాణించే విధానాన్ని అనుసరిస్తోంది. భూమి చుట్టు ఉన్న 170*36,500 కి.మీ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో చంద్రయాన్-3 ని ప్రవేశపెడుతోంది.

చంద్రయాన్-3 భూమి చుట్టు 24 రోజుల పాటు తిరుగుతూ కక్ష్యను పెంచుకుంటూ పోతుంది. చివరికి చంద్రుని గ్రావిటీ క్షేత్రంలోకి చేరుకుంటుంది. అందుకే ఈ ప్రక్రియకు దాదాపు 40 రోజులు పడుతుంది.