కరోనా మహమ్మారి తాలుకూ భయాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. 2020లో చైనాలో మొదలైన వైరస్ యావత్ ప్రపంచాన్ని చుట్టేసింది. వేలాది మంది ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. లాక్డౌన్తో ప్రపంచమే స్థంభించి పోయింది. ఎక్కడి కార్యక్రమాలు అక్కడ నిలిచిపోయాయి. వైద్య రంగం మొదలు, ఆర్థిక రంగం వరకు కుదేలైంది. వైరస్ కారణంగా ప్రతీ రంగంపై ప్రతికూల ప్రభావం పడింది.
అయితే కోవిడ్ 19 వ్యాక్సిన్ తర్వాత కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టింది, మరణాలు కూడా తగ్గాయి. ఆ భయానక సందర్భాల నుంచి ప్రపంచం మొత్తం బయటపడింది. అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం ఉండదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం విస్తరిస్తోన్న కొత్త వేరియంట్ ఇందుకు కారణంగా చెప్పొచ్చు. కరోనా వైరస్లో కొత్తరకం వేరియంట్ ఇప్పుడు బ్రిటన్ను వణికిస్తోంది.
ఒమిక్రాన్ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన ఈజీ 5.1 అనే ఈ కొత్త రకం వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది. బ్రిటన్లో కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 14.6 శాతం ఇవే కేసులు ఉన్నట్టు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వేరియంట్ను మొదటిసారిగా 2023 జూలై నెలలో గుర్తించారు.
కేవలం బ్రిటన్లోనే కాదు అంతర్జాతీయంగానూ ఈ కేసులు పెరుగుతున్నట్టు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా, అంతకుముందు కరోనా నుంచి వచ్చి, తగ్గిన వారు కూడా ఈ కొత్త వేరియంట్తో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇదిలా ఉంటే సంతోషించే విషయం ఏంటంటే ఈ వేరియంట్తో తీవ్ర ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.
మరి బ్రిటన్లో మొదలైన ఈ కొత్త వేరియంట్ ప్రపంచాన్ని చుట్టేస్తుందా.? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే నిపుణులు మాత్రం ఆ భయం అవససరం లేదని చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్తో తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు.