
టీవీ9 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే రెండవ ఎడిషన్ ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సదస్సును టీవీ నైన్ సీఈఓ బరుణ్ దాస్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. సదస్సులో స్వాగతోపన్యాసం చేసిన టీవీ9 సీఈఓ బరుణ్దాస్ సదస్సులో చర్చించే అంశాలను ప్రస్తావించారు. అదే సమయంలో భారత్ను ప్రపంచం చూసే తీరు మారిందని గుర్తు చేశారు.

క్రీడల్లో భారత్ రాణిస్తున్న విధానంగా సదస్సులో నిర్వహించిన సెషన్లో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మనస్సు విప్పి మాట్లాడారు. చిన్న వయస్సుల్లోనే క్రికెట్లో రాణించడం నుంచి నేడు మంత్రిగా నిర్వహిస్తున్న బాధ్యతల వరకు ప్రతీ విషయంపై ఆయన మాట్లాడారు. 2036 ఒలింపిక్స్కు భారతదేశం కచ్చితంగా ఆతిథ్యమిస్తుందని అనురాగ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు.

వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో భాగంగా ప్రముఖులను నక్షత్ర సమ్మాన్ అవార్డులతో సత్కరించింది టీవీ9. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, టీవీనైన్ సీఈఓ బరుణ్ దాస్ నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఎవర్షైనింగ్ అవార్డు అందుకున్నారు.

నారీశక్తిపై నిర్వహించిన సదస్సులో రవీనా టాండన్ మాట్లాడారు. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ అనే పేర్లు తమకొద్దని, దానిని తాము కోరుకోవడం లేదని తాము కోరుకునేది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని టీవీ నైన్ వేదికగా రవీనా టాండన్ స్పష్టం చేశారు.

'బాలీవుడ్ అనే పిలుపును కోరుకోవడం లేదు. ఈ రంగంలోని వాళ్లు బాలీవుడ్ అనే పదాన్ని ద్వేషిస్తారు. అది మాకు సంబంధించిన పదం కాదు. బాలీవుడ్, శాండల్వుడ్, టాలీవుడ్, ఆ వుడ్ ఈ వుడ్ ఇవేవి మాకొద్దు, మేము ఇండియన్ ఫిల్మ్ ఇండిస్ట్రీ. అదే మేము కోరుకునేది' అని వ్యాఖ్యానించింది రవీనా.

సదస్సుల్లో భాగంగా బ్యాడ్మింటన్ క్రీడాకారణి అన్మోల్ ఖార్బ్, కశ్మీర్కు చెందిన భారత పారా క్రికెట్ కెప్టెన్ అమీర్ హుస్సేన్ లోన్కు టీవీ నైన్ నక్షత్ర సమ్మాన్ అవార్డును పుల్లెల గోపిచంద్, అమితాబ్ కాంత్ అందించారు.

రెండు గ్రామీ అవార్డులందుకున్న భారతీయ ఫ్లూటిస్ట్ రాకేష్ చౌరసియా, ఏషియన్ గేమ్స్లో మెడల్స్ సాధించిన పంజాబ్ అథ్లెట్ హర్మిలన్ బైన్స్, ప్రపంచ రికార్డు నెలకొల్పిన షూటర్ సిఫ్ట్ కౌర్ సామ్రా నక్షత్ర సమ్మాన్ అందుకున్నారు.

నారీశక్తిపై నిర్వహించిన మరో సదస్సులో ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు కుష్బు పాల్గొన్నారు. సినిమా రంగంలో వచ్చినప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితులను కుష్బు వివరించారు.

బ్రాండింగ్ ఇండియా సదస్సులో ఇండియా G20 షెర్పా అమితాబ్ కాంత్ అనేక విషయాలపై మాట్లాడారు.